
Reliance Industries: కరోనా మహమ్మారి చాలా మందిని బలి తీసుకుంటోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరిని వదిలి పెట్టడం లేదు. రోజురోజుకు అందరిని వెంటాడుతోంది. ఇప్పటికే చాలా మంది కరోనా బారిన పడుతూ మృత్యువాత పడుతున్నారు. ఇక ఉద్యోగాలు చేసుకునేవారు కరోనా బారిన పడితే కుటుంబం గడవడం కష్టతరమవుతోంది. ఈ నేపథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీ కీలక నిర్ణయం తీసుకుంది. తమ ఉద్యోగుల పట్ల మానవత్వం చాటుకుంది. కరోనా మహమ్మారి సమయంలో రిలయన్స్ ఉద్యోగులకు అండగా నిలుస్తోంది. కరోనాతో మృతి చెందిన ఉద్యోగులకు ఆర్థికంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని రిలయన్స్ తెలిపింది. కోవిడ్తో మృతి చెందిన ఉద్యోగులకు చివరి నెల జీతం ఎంత తీసుకుంటారో అదే జీతం ఐదు సంవత్సరాల పాటు మృతుని కుటుంబానికి అందించనున్నట్లు వెల్లడించింది. అంతేకాకుండా మరణించిన ఉద్యోగి పిల్లలకు విద్యాభ్యాసానికి అయ్యే ఖర్చు భరిస్తామని తెలిపింది. హాస్టల్ వసతి, ట్యూషన్ ఫీజు, ఇతర విద్యకు సంబంధించిన ఖర్చులన్నీ భరిస్తామని స్పష్టం చేసింది. అలాగే ఉద్యోగి కరోనా బారిన పడిన సమయంలో వారు పూర్తి కోలుకునే వరకు పూర్తి కాలానికి కోవిడ్ సెలవులను పొందవచ్చని తెలిపింది. ముఖ్యంగా ఉద్యోగుల్లో ఎవరికైనా కోవిడ్ సోకితే వారిపై ప్రత్యేక శ్రద్ద వహించనున్నట్లు రిలయన్స్ తెలిపింది. కోవిడ్ బారిన పడిన మృతి చెందిన కుటుంబానికి రూ.10 లక్షల ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తమ ఉద్యోగులను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు.