Ramdev : కొవిడ్ వ్యాక్సిన్ పైన దుమారాన్ని లేపిన రాందేవ్ బాబా యూటర్న్.. నా పోరాటం వైద్యులపై కాదు డ్రగ్‌మాఫియా పైనే అని వెల్లడి

|

Jun 10, 2021 | 2:34 PM

వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమ్ము దుమారం చేసిన..

Ramdev : కొవిడ్ వ్యాక్సిన్ పైన దుమారాన్ని లేపిన రాందేవ్ బాబా యూటర్న్..  నా పోరాటం వైద్యులపై కాదు డ్రగ్‌మాఫియా పైనే అని వెల్లడి
Baba Ram Dev
Follow us on

Ramdev Baba : కొవిడ్‌ వ్యాక్సిన్‌ వల్ల ఎలాంటి ఉపయోగం లేదని, టీకాలు తీసుకున్న తరువాత కూడా వేలాది మంది వైద్యులు మరణించారంటూ దుమ్ము దుమారం చేసిన యోగా గురు బాబా రాందేవ్‌ యూ టర్న్‌ తీసుకున్నారు. త్వరలోనే తాను కూడా కరోనా వ్యాక్సిన్‌ తీసుకుంటానని ప్రకటించారు. అల్లోపతిపైన, డాక్టర్లపైనా సంచలన వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న రాందేవ్ వైద్యులు దేవుని దూతల్లాంటి వారంటూ ఇప్పుడు తాజాగా పేర్కొన్నారు. తన పోరాటం వైద్యులపై కాదు, మాదకద్రవ్యాల మాఫియాకు వ్యతిరేకంగా అంటూ ఆయన ప్రకటించారు. శస్త్రచికిత్సలు, అత్యవసర పరిస్థితుల్లో అల్లోపతి విధానం ఉత్తమమైందని చెప్పిన రాందేవ్… తాను భారతీయ వైద్యవ్యవస్థని ద్వేషించడం లేదని తెలిపారు. ప్రాణాంతక ఇతర వ్యాధులు, తీర్చలేని రుగ్మతలు పురాతన పద్ధతుల ద్వారా నయం చేయవచ్చని ఆయుర్వేదంలో ఉందన్నారు.

అంతేకానీ, అనవసరమైన మందులు, చికిత్సల పేరుతో ప్రజలను దోపీడీ చేయకూడదని ఆయన హితవు పలికారు. అలాగే ప్రభుత్వం అందిస్తున్న జనరిక్ మెడిసిన్ తక్కువ ధరలకే ప్రజలకు అందుబాటులో ఉంటున్నాయని చెప్పుకొచ్చారు. ప్రతి పౌరుడికి ఉచితంగా టీకాలు వేసేలా మోదీ చారిత్రాత్మక ప్రకటన చేశారనీ, ప్రతి ఒక్కరూ టీకాలు వేయించుకోవాలని కోరారు. యోగా, ఆయుర్వేదాన్ని ప్రజలంతా ఆచరించాలని, వ్యాధుల నివారణలో యోగా రక్షణ కవచంలా ఉంటుందనీ, ముఖ్యంగా కరోనా నుండి యోగా రక్షిస్తుందని రాందేవ్‌ పేర్కొన్నారు.

అలాగే అంతర్జాతీయ యోగా దినోత్సవం అయిన జూన్ 21 నుంచి అందరికీ ఉచిత టీకా అందుబాటులో రావడంపై బాబా రాందేవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ఆయన ప్రశంసలు కురిపించారు. కాగా, గతంలో వ్యాక్సిన్ సమర్థత, అల్లోపతిని, వైద్యులను కించపరిచేలా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ మండిపడిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాందేవ్‌కు లీగల్‌ నోటీసు కూడా ఇచ్చింది. దీంతోపాటు కేంద్ర ఆరోగ్యమంత్రికి, ప్రధానికి లేఖ రాసింది. ఢిల్లీ మెడికల్ అసోసియేషన్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు విచారణను జూలై 13వ తేదీకి వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

Read also  : Black Market of medicines : అత్యవసర ఇంజక్షన్లు కొని బ్లాక్ లో భారీ మొత్తానికి అమ్ముతోన్న హైదరాబాద్ యువకుడు అరెస్ట్