నకిలీ డాక్టర్ నిర్వాకం.. జ్వరంతో వచ్చిన రోగికి ఇంజక్షన్.. క్లినిక్‌లోనే వ్యక్తి మృతి!

ఓ ఫేక్‌ డాక్టర్‌ వైద్యం కోసం వచ్చిన రోగికి తప్పుడు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో రోగి క్లినిక్‌లోనే మృతి చెందాడు. అనంతరం మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన విసిరేశాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చాయి. తననను తాను జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమా హోల్డర్‌గా చెప్పుకొంటు డాక్టర్‌గా చలామని అవుతూ అమాయకుల ప్రాణాలతో చలగాటం..

నకిలీ డాక్టర్ నిర్వాకం.. జ్వరంతో వచ్చిన రోగికి ఇంజక్షన్.. క్లినిక్‌లోనే వ్యక్తి మృతి!
Man Dies After Getting Injected

Updated on: Sep 12, 2023 | 1:51 PM

న్యూఢిల్లీ, సెప్టెంబర్‌ 12: ఓ ఫేక్‌ డాక్టర్‌ వైద్యం కోసం వచ్చిన రోగికి తప్పుడు ఇంజక్షన్ ఇచ్చాడు. దీంతో రోగి క్లినిక్‌లోనే మృతి చెందాడు. అనంతరం మృత దేహాన్ని కారులో తీసుకెళ్లి రోడ్డు పక్కన విసిరేశాడు. మృతుడి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్‌ విషయాలు వెలుగులోకొచ్చాయి. తననను తాను జనరల్ నర్సింగ్ అండ్‌ మిడ్‌వైఫరీ (GNM) డిప్లొమా హోల్డర్‌గా చెప్పుకొంటు డాక్టర్‌గా చలామని అవుతూ అమాయకుల ప్రాణాలతో చలగాటం ఆడుతున్న నకిలీ డాక్టర్‌ను పోలీసులు కటకటాల పాలు చేశారు. రాజస్థాన్‌లోని బుండి జిల్లాలో ఈ దారుణ ఘటన సోమవారం (సెప్టెంబర్ 11) వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

రాజస్థాన్‌లోని బుండి జిల్లాలోని ఇందర్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దేవ్‌పురా గ్రామానికి చెందిన ఓం ప్రకేష్ గుర్జార్ (38) దగ్గు, జ్వరంతో ఓ ప్రైవేట్ క్లినిక్‌కి వెళ్లాడు. అక్కడ డాక్టర్‌గా చలామని అవుతోన్న హరియోమ్ సైనీ (35) మోనోసెఫ్ 500 మి.గ్రా. ఇంజెక్షన్ ఇచ్చాడు. ఆ తర్వాత ప్రకేష్‌ గుర్జార్‌ పరిస్థితి విషమించి అక్కడికక్కడే మృతి చెందాడు. ఐతే ఆ మరుసటి రోజు అంటే మంగళవారం ఇందర్‌గఢ్ పట్టణంలోని సుమెర్‌గంజ్ మండి రోడ్డులో ప్రకేష్‌ గుర్జార్‌ అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు సదరు ప్రైవేట్‌ డాక్టర్‌పై హత్య కేసు నమోదు చేశారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసుల అసలు విషయం కనుగొన్నారు. అసలు సదరు ప్రైవేట్‌ క్లినిక్‌ డాక్టర్‌ ఓ నకిలీ డాక్టర్‌ అని, జీఎన్‌ఎమ్‌ డిగ్రీ హోల్డర్‌గా చెప్పుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలోనే తన వద్దకు వచ్చిన బాధితుడికి మోనోసెఫ్ 500 ఇంజక్షన్ ఇచ్చాడని, అది వికటించి అతను మృతి చెందినట్లు ఇందర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లోని సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రామేశ్వర్ చౌదరి తెలిపారు.

ఇంజక్షన్ వేసిన వెంటనే పల్స్, బ్లడ్ ప్రెజర్ తగ్గిపోవడంతో ఓం ప్రకేష్ పరిస్థితి విషమించి స్పృహ తప్పి పడిపోయాడు. దీంతో అదే రోజు క్లినిక్‌లోనే ప్రకేష్ మృతి చెందినట్లు సీఐ తెలిపారు. దీంతో నిందితుడు హరియోమ్ సైనీ అదే రోజు రాత్రి దీపక్ అనే సహాయకుడి సహాయంతో మృతదేహాన్ని తన కారులో తీసుకెళ్లి మృతుడి మృతదేహాన్ని ఇందర్‌గఢ్‌ పట్టణంలోని రోడ్డుపై పడేశాడు. ఓం ప్రకేష్ మొబైల్‌ని అతని చేతిలో పెట్టి వాళ్లిద్దరూ అక్కడి నుంచి కారులో వెళ్లిపోయినట్లు సీఐ తెలిపారు. విచారణలో నిందితుడు నేరం అంగీకరించాడని, ఓం ప్రకేష్ మృతదేహం లభ్యమైన ఐదు రోజుల తర్వాత ఆదివారం సాయంత్రం నిందితుడిని అరెస్టు చేశామని, సోమవారం కోర్టు ముందు హాజరుపరచగా, అతన్ని జ్యుడీషియల్ కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించినట్లు ఆయన తెలిపారు. నిందితుడి క్లినిక్‌ని కూడా సోమవారం వైద్య శాఖ బృందం సీజ్ చేసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.