
రాజస్థాన్లోని కోటా నగరంలో అర్ధరాత్రి దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. సుమారు 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన చంద్రేసల్ మఠంలో గుర్తుతెలియని దుండగులు మఠాధిపతి దేవానంద్ మహారాజ్ను పదునైన ఆయుధంతో దాడి చేసి హత్య చేశారు. ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు కారణమైంది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
రాత్రి సమయంలో కొందరు దుండగులు బోర్ఖేడా పోలీస్ స్టేషన్ పరిధిలోని మఠ ప్రాంగణంలోకి ప్రవేశించారు. ఆ సమయంలో దేవానంద్ మహారాజ్ మరియు నందనవన్ మహారాజ్ తమతమ గదుల్లో నిద్రిస్తున్నారు. దుండగులు మొదట నందనవన్ మహారాజ్ను గదిలో బంధించారు. ఆ తర్వాత దేవానంద్ మహారాజ్పై దాడి చేశారు. మెడ, వీపుపై తీవ్రమైన గాయాలు కావడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
చంద్రేసల్ మఠం కోటాలో అత్యంత ఆధ్యాత్మిక ప్రాధాన్యం కలిగిన పవిత్ర స్థలం. దేవానంద్ మహారాజ్ స్వస్థలం సవాయి మాధోపూర్ జిల్లాలోని రజ్వానా గ్రామం. గత నాలుగేళ్లుగా ఆయన ఈ మఠంలో నివసిస్తూ ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ దారుణానికి సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు మొదలుపెట్టారు. ఘటనాస్థలంలో ఆధారాలను సేకరించిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు గల కారణాలు ఇంకా తేలలేదు. కేసు విచారణ కొనసాగుతోంది….సాధు సమాజంలో ఆగ్రహం….ఈ దారుణ ఘటనపై సాధు-సంత్ సమాజంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తమవుతోంది. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన పవిత్ర మఠంలో జరిగిన ఈ హత్య మతపరమైన సమాజాలలో తీవ్ర ఆందోళనను రేకెత్తించింది. నిందితులను త్వరగా పట్టుకోవాలని అన్ని వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..