Rahul Gandhi: వయనాడ్‌, రాయ్‌బరేలీ వైపు అందరి చూపు.. ఆ సీటును వదులుకోనున్న రాహుల్..!

|

Jun 17, 2024 | 4:43 PM

మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో కేరళలోని వయనాడ్ లోక్‌సభ నియోజకవర్గంతో పాటు ఉత్తర ప్రదేశ్‌లోని రాయ్ బరేలీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ.. రెండు స్థానాల్లోనూ విజయం సాధించారు. దీంతో ఏదైనా ఒక నియోజకవర్గాన్ని వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రాహుల్ గాంధీ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారన్న అంశంపై జాతీయ రాజకీయాల్లోనూ గత కొంతకాలంగా ఆసక్తి నెలకొంది.

Rahul Gandhi: వయనాడ్‌, రాయ్‌బరేలీ వైపు అందరి చూపు.. ఆ సీటును వదులుకోనున్న రాహుల్..!
Rahul Gandhi
Follow us on

ఇప్పుడు అందరి చూపు కేరళలోని వయనాడ్, యూపీలోని రాయ్‌బరేలి నియోజకవర్గాల వైపు నెలకొంటోంది. కారణం మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఆ రెండు లోక్‌సభ నియోజకవర్గాల నుంచి పోటీచేసిన రాహుల్ గాంధీ.. రెండు చోట్లా విజయం సాధించడమే.. దీంతో ఏదైనా ఒక నియోజకవర్గాన్ని రాహుల్ గాంధీ వదులుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.  ఈ రెండు సీట్లలో రాహుల్ ఏ నియోజకవర్గాన్ని వదులుకుంటారన్న అంశంపై జాతీయ రాజకీయాల్లోనూ గత కొంతకాలంగా ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ.. రాయ్ బరేలీ ఎంపీగా కొనసాగుతూ వయనాడ్‌ ఎంపీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఆయన ఒకట్రెండు రోజుల్లోనే అధికారిక ప్రకటన చేస్తారని జాతీయ మీడియా వర్గాలు వెల్లడించారు. కీలకమైన యూపీలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే రాహుల్ గాంధీ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

రాయ్ బరేలీ నియోజకవర్గం దశాబ్ధాలుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. 2004 నుంచి సోనియా గాంధీ ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహించారు. 2004, 2009, 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా నాలుగుసార్లు సోనియా గాంధీ అక్కడి నుంచి విజయం సాధించారు. 2024 ఎన్నికల్లో ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాయ్ బరేలీ నుంచి ప్రియాంక వాద్రా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసే అవకాశమున్నట్లు జోరుగా ఊహాగానాలు వినిపించాయి. అయితే తీవ్ర కసరత్తు అనంతరం రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీని బరిలో దింపుతో కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.  ఆ మేరకు అక్కడి నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ భారీ మెజార్టీతో విజయం సాధించారు.  గతంతో ఇందిరా గాంధీ, ఫిరోజ్ గాంధీ కూడా ఈ నియోజకవర్గానికి ప్రాతినిథ్యంవహించారు.

వయనాడ్ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక వాద్రా?

రాహుల్ గాంధీ రాజీనామా అనంతరం జరిగే వయనాడ్ లోక్‌సభ ఉప ఎన్నికకు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సోదరి ప్రియాంక వాద్రా పోటీ చేయనున్నారు. ప్రియాంక వాద్రా పేరును కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేయడం లాంఛనమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిణామాలు కేరళతో పాటు జాతీయ రాజకీయాల్లోనూ ఆసక్తిరేపుతున్నాయి.