లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు.. మంత్రి ఓ క్రిమినల్ అంటూ రాహుల్ ధ్వజం

|

Dec 16, 2021 | 2:49 PM

Lakhimpur violence Case: యూపీలో జరిగిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై ఇవాళ పార్లమెంటు దద్ధరిల్లింది. ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో విపక్షాలు ఈ అంశంపై తీవ్రస్థాయిలో గళమెత్తాయి.

లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై దద్దరిల్లిన పార్లమెంటు.. మంత్రి ఓ క్రిమినల్ అంటూ రాహుల్ ధ్వజం
Lakhimpur Kheri Case
Follow us on

యూపీలో జరిగిన లఖింపుర్‌ ఖేరీ హింసాత్మక ఘటనపై ఇవాళ పార్లమెంటు దద్ధరిల్లింది. ఇటు లోక్‌సభలో, అటు రాజ్యసభలో విపక్షాలు ఈ అంశంపై తీవ్రస్థాయిలో గళమెత్తాయి. ప్రణాళిక ప్రకారమే ఈ ఘటనకు పాల్పడినట్లు సిట్‌ ఇటీవల సంచలన విషయాలను వెల్లడించడంతో… కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాను తక్షణమే పదవి నుంచి తొలగించాలంటూ విపక్ష సభ్యులు లోక్‌సభలో ఆందోళనకు దిగారు. ఎంత చెప్పినా సభ్యులు వినకపోవడంతో సభను వాయిదా వేశారు స్పీకర్‌.

కేంద్రం తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. కేంద్ర మంత్రి అజయ్‌ మిశ్రాపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఆయనో క్రిమినల్‌’ అనీ.. వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. లఖింపుర్‌ ఖేరీ ఘటన ఓ కుట్ర అని తేలిందనీ.. ఆ ఘటనకు ఎవరి కుమారుడు బాధ్యుడో ప్రతిఒక్కరికీ తెలుసనీ రాహుల్‌ చెప్పారు. ఆ మంత్రి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనీ.. దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాలనీ డిమాండ్‌ చేశారు. అయితే, ప్రధాని అందుకు అంగీకరించట్లేదనీ ఆరోపించారు. రైతుల హత్యకు కారణమైన మంత్రిని వెంటనే పదవి నుంచి తప్పించి.. కఠినంగా శిక్షించాలని రాహుల్ గాంధీ డిమాండ్‌ చేశారు.

లఖింపుర్‌ ఖేరీ ఘటనపై చర్చ జరపాల్సిందేనని లోక్‌సభలో విపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్ష ఎంపీలు ప్లకార్లులు చేతబట్టి వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం ఏర్పడింది. ఆందోళన విరమించాలని స్పీకర్‌ వారించినప్పటికీ వారంతా వెనక్కి తగ్గలేదు. దీంతో స్పీకర్‌ సభను మధ్యాహ్నానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభలోనూ అదే గందరగోళం ఏర్పడింది.

సాగుచట్టాలను వ్యతిరేకిస్తూ.. ఆందోళన చేస్తున్న రైతులపైకి.. అక్టోబర్‌ మూడున కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిశ్‌ మిశ్రా కాన్వాయ్‌ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒక జర్నలిస్టు, 8మంది రైతులు సహా మొత్తం 9మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. కేసు దర్యాప్తు తీరుపై.. సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆశిష్‌ మిశ్రాను.. పోలీసులు అరెస్ట్‌ చేశారు. అయితే, దీనిపై దర్యాప్తు జరిపిన సిట్‌… కుట్రపూరితంగా నిందితుడు ఈ ఘటనకు పాల్పడినట్టు తేల్చింది. దీంతో, ఈ వ్యవహారం రాజకీయంగా మరోసారి వేడెక్కింది. లఖీంపూర్‌ ఘటనకు బాధ్యత వహిస్తూ కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

Also Read..

Harkirat Singh Bajwa: భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లాడు.. అండర్-19 జట్టులో చోటు దక్కించుకున్నాడు..

Pushpa: బొమ్మ అదుర్స్‌ అంతే.. యూఏఈ నుంచి పుష్ప మొదటి రివ్యూ..