
మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పంజాబ్ కాంగ్రెస్ ఇన్చార్జ్, ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ స్పష్టం చేశారు. శుక్రవారం (ఫిబ్రవరి 06) ఆయన అమృత్సర్లోని డాక్టర్ రాజ్ కుమార్ వెర్కా నివాసానికి చేరుకుని మీడియాతో మాట్లాడారు. పార్టీ క్రమశిక్షణ అన్నింటికంటే ముఖ్యమని, పార్టీ లైన్ నుండి తప్పుకుని పనిచేసే నాయకులపై చర్యలు తప్పవని బాఘేల్ హెచ్చరించారు.
మోదీ ప్రభుత్వం చేసిన MNREGA మార్పులపై బాఘేల్ తీవ్రంగా దాడి చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త చట్టాలు సమాజంలో అట్టడుగున ఉన్న పేదలు, కార్మికులు, బలహీన వర్గాల హక్కులను హరించబోతున్నాయని ఆయన అన్నారు. సోనియా గాంధీ, డాక్టర్ మన్మోహన్ సింగ్ హయాంలో కార్మికులు, పేదల హక్కుల కోసం అనేక చట్టాలు రూపొందించారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం వాటిని బలహీనపరుస్తోందని బాఘేల్ గుర్తు చేశారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నాయకత్వంలో ఈ పోరాటం వీధుల నుండి పార్లమెంటు వరకు జరుగుతుందని ఆయన అన్నారు. పంజాబ్ ప్రజల హక్కుల కోసం కాంగ్రెస్ పార్టీ దృఢంగా నిలుస్తుందని, నేరాలు, మాదకద్రవ్యాలు, మాఫియా పాలనకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని తీవ్రతరం చేస్తుందని భూపేశ్ బాఘేల్ పేర్కొన్నారు.
ఇదిలావుంటే, మాజీ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్ సిద్ధూ పార్టీ మారుతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.. అయితే, ఈ మొత్తం విషయంపై నవజ్యోత్ సింగ్ సిద్ధూ నుంచి ఇంకా ఎటువంటి స్పందన రాలేదు. మరోవైపు, సిద్ధూ దంపతులు భారతీయ జనతా పార్టీలో చేరవచ్చనే చర్చలు జరుగుతున్నాయి. నవజ్యోత్ కౌర్ సిద్ధూ ఇటీవల వరుస ట్వీట్లు చేస్తూ బీజేపీని, ప్రధాని మోదీని ప్రశంసిస్తున్నారు. అయితే, ఈ ఊహాగానాల మధ్య, బీజేపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి మనోరంజన్ కాలియా మాట్లాడుతూ సిద్ధూ దంపతులకు పార్టీ తలుపులు మూసుకుపోయాయని అన్నారు.
అయితే, నవజ్యోత్ సింగ్ సిద్ధూ, అతని భార్య కౌర్ సిద్దూ గతంలో బీజేపీని విడిచిపెట్టి, కాంగ్రెస్లో చేరారు. ఇప్పుడు వారి పునరాగమనం గురించి ఊహాగానాలు వస్తున్నాయి. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల్లో సిద్దూ దంపతులు తిరిగి రావడం గురించి చర్చలు జరుగుతున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..