
దేశ రాజధాని ఢిల్లీ కాలుష్యం కోరల్లో చిక్కి.. ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. ఓ వైపు పొరుగు రాష్ట్రాల నుంచి పంట వ్యర్థాల దగ్ధం.. మరోవైపు దీపావళి బాణసంచాల పేలుళ్లు. ఇంకోవైపు వాహనాల నుంచి వెలువడే పొగ.. వెరిసి కాలుష్యానికి కేరాఫ్ అడ్రస్గా మారింది ఢిల్లీ. గతకొద్ది రోజులుగా కాలుష్య స్థాయి ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో “హెల్త్ ఎమర్జెన్సీ” ప్రకటించింది. నవంబరు 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం దృష్ట్యా నవంబరు 5 వరకు పాఠశాలలకు సెలవులు ప్రకటిస్తున్నట్లు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.
ఈ నేపథ్యంలో పర్యావరణ కాలుష్య నియంత్రణ మండలి(ఈపీసీఏ) ఛైర్మన్ భురేలాల్ ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు లేఖ రాశారు. ఢిల్లీ, ఎన్సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత దారుణంగా పడిపోయిందని.. గురువారం రాత్రి నుంచి అక్కడ కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉందని.. దీంతో ప్రజల ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదముందని.. అందుకే ఈ ప్రాంతాల్లో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటిస్తున్నామని భురేలాల్ లేఖలో పేర్కొన్నారు.
ఢిల్లీ, ఫరీదాబాద్, గురుగ్రామ్, ఘజియాబాద్, నోయిడా, గ్రేటర్ నోయిడా ప్రాంతాల్లో అయిదు రోజులపాటు నిర్మాణ కార్యకలాపాలు, స్టోన్ క్రషర్లపై ఆంక్షలు విధించారు. అంతేకాదు.. ఈ శీతాకాలం ముగిసేవరకు బాణసంచా పేల్చడంపై నిషేధం విధించారు. బొగ్గు, ఇతర ఇంధన ఆధారిత పరిశ్రమలను కూడా మూసివేయాలంటూ ఈపీసీఏ ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో పంట వ్యర్థాలను తగలబెట్టడంపై తక్షణ చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.
అధికారిక డేటా ప్రకారం.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘బాగుంది’ అని, 51-100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ అని, 101-200 మధ్య ఉండే ‘మధ్యస్తం’, 201-300 అయితే ‘బాగోలేదు’, 301-400 అయితే ‘ఏమాత్రం బాగోలేదు’, 401-500 మధ్య అయితే ‘ప్రమాదకరం’, 500పైన ఉంటే ‘ప్రమాదకరం-ప్లస్ ఎమర్జెన్సీ’గా పరిగణిస్తారు.