పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతం.. సీఎంఎస్–01 ఉపగ్రహం ఎలాంటి సేవలు అందిస్తుందంటే..
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్
శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి ప్రయోగించిన పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. సీఎంఎస్–01 (జీశాట్–12ఆర్) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని భూమికి దగ్గరగా 265 కి.మీ, భూమికి దూరంగా 35,975 కి.మీ ఎత్తులోని జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లో దీర్ఘ వృత్తాకార కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ సీ–50 రాకెట్ 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయబావుటా ఎగురవేసింది. షార్ నుంచి 77వ ప్రయోగం, పీఎస్ఎల్వీ సిరీస్లో 52 ప్రయోగాలు జరగ్గా.. 50 ప్రయోగాలు విజయవంతమయ్యాయి. దీంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్, శాస్త్రవేత్తలు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం ప్రయోగాన్ని విజయంతం చేసేందుకు కృషిచేసిన మిషన్ టీం, శాటిలైట్ టీంలను అభినందించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అభినదందనలు తెలిపారు.
పీఎస్ఎల్వీ సీ–50 ద్వారా ప్రయోగించిన సీఎంఎస్–01 ఉపగ్రహం సేవలు ఎంతో మెరుగ్గా ఉంటాయన్నారు.11 ఏళ్ల కిందట ప్రయోగించిన జీశాట్–12 స్థానంలో ఈ ఉపగ్రహం సేవలందిస్తుందని తెలిపారు. సీఎంఎస్–01 ఉపగ్రహాన్ని విజయవంతంగా సబ్ జీటీవో ఆర్బిట్లోకి ప్రవేశపెట్టామని, శుక్రవారం నుంచి ఉపగ్రహంలోని ఇంధనాన్ని నాలుగు సార్లు మండించి సబ్ జీటీవో ఆర్బిట్ నుంచి జియో ఆర్బిట్లోకి ప్రవేశపెడతామన్నారు. ఈ ప్రక్రియ నాలుగు రోజుల పాటు నిర్వహించి 21వ తేదీన భూమికి 36 వేల కి.మీ ఎత్తులోని జియో ఆర్బిట్కు పంపిస్తామని శివన్ వివరించారు.