PM Narendra Modi launches Sansad TV: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంసద్ టీవీ ప్రసారాలను బుధవారం ప్రారంభించారు. ఉప రాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం. వెంకయ్య నాయుడు, లోక్సభ సభాపతి ఓం బిర్లా సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా.. లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి సంసద్ టీవీగా ఏర్పాటు చేస్తున్నట్లు అంతకుముందు స్పీకర్ వెల్లడించిన విషయం తెలిసిందే. పార్లమెంటు కార్యకలాపాలను విస్తృత స్థాయిలో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఈ రెండు టీవీలను కలిపి సంసద్ టీవీగా ప్రారంభించారు. అయితే.. ప్రారంభించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం రోజున సంసద్ టీవీ ప్రారంభమవుతుండటం సంతోషకరమంటూ వెల్లడించారు. పార్లమెంట్ వ్యవహారాలను విస్తృత స్థాయిలో ప్రచారం చేసేందుకు సంసద్ టీవీ దోహదం చేస్తుందని ప్రకటించారు. సంసద్ టీవీలో కార్యక్రమాలు నాలుగు రకాలుగా ప్రసారం కానున్నాయి. పార్లమెంటు, ప్రజాస్వామిక వ్యవస్థల కార్యకలాపాలు, పథకాలు, విధానాల అమలు, పాలన, భారత దేశ చరిత్ర, సంస్కృతి, సమకాలిక అంశాలకు సంబంధించిన కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
కాగా.. లోక్సభ టీవీ, రాజ్యసభ టీవీలను కలిపి ఒకే ఛానల్గా ఏర్పాటు చేయడానికి ప్రసార భారతి సీఈఓ సూర్య ప్రకాశ్ నేతృత్వంలోని కమిటీ అంతకుముందు ఆమోదం తెలిపింది. 2006 జూలైలో లోక్సభ టీవీ ఏర్పాటైంది. లోక్సభ మాజీ స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ ఆలోచనల మేరకు దీనిని ఏర్పాటు చేశారు. రాజ్యసభ టీవీ 2011లో ప్రారంభమైంది. కాగా.. ఈ రెండింటిని కలిపి ఒకటే టీవీగా ఏర్పాటు చేయాలని కమిటీ వెల్లడించింది.
Also Read: