
దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘రోజ్గార్ మేళా’ శనివారం (మే 23) ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ విధానం ద్వారా హాజరై, వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఎంపికైన 51,000 మందికి పైగా యువతకు ఉద్యోగ నియామక పత్రాలను పంపిణీ చేశారు. దేశవ్యాప్తంగా మొత్తం 47 ప్రాంతాలలో ఈ మెగా నియామక ప్రక్రియను చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, “దేశవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువతకు, వారి కుటుంబాలకు ఎంతో ముఖ్యమైన రోజు. కొత్తగా కొలువులు సాధించిన యువత దేశ అభివృద్ధి ప్రయాణంలో కీలక భాగస్వాములు కాబోతున్నారు” అని ఆకాంక్షించారు. రైల్వే, బ్యాంకింగ్, రక్షణ, ఆరోగ్యం, ఉన్నత విద్య, హోం వ్యవహారాలు, ఆర్థిక సేవలు వంటి వివిధ కీలక రంగాలలో యువత కొత్త బాధ్యతలు చేపట్టబోతున్నారని ఆయన పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్’ సంకల్పాన్ని నెరవేర్చడంలో.. ‘విజయ్ భారత్’ దిశగా దేశాన్ని నడిపించడంలో యువశక్తి పాత్ర అమోఘమైనదని మోదీ కొనియాడారు.
భారతదేశ యువత ప్రతిభ, దేశ సాంకేతిక పురోగతి పట్ల నేడు ప్రపంచం ఎంతో ఉత్సాహంగా ఉందని, ప్రపంచ దేశాలన్నీ భారత్తో కలిసి నడవాలని కోరుకుంటున్నాయని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొత్త అవకాశాల ద్వారా యువశక్తిని బలోపేతం చేయాలనే తమ ప్రభుత్వ నిబద్ధతకు ఈ రోజ్గార్ మేళా ఒక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలనే ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ఈ కార్యక్రమం కొనసాగుతోంది. ‘రోజ్గార్ మేళా’ ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 18 విడతల్లో కార్యక్రమాలను నిర్వహించారు. సుమారు 12 లక్షల మందికి పైగా అభ్యర్థులకు ఉద్యోగ అపాయింట్మెంట్ లెటర్స్ అందజేసినట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు వెల్లడించారు. తాజాగా ఎంపికైన అభ్యర్థులు దేశంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం.
India’s youth are playing a vital role in accelerating the journey towards a Viksit Bharat. Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti with new opportunities.
https://t.co/u3CQqgrluM— Narendra Modi (@narendramodi) May 23, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..