మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.2500.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం..

ఢిల్లీలోఆర్థికంగా వెనుకబడిన లక్షలాది మంది మహిళలకు రేఖా గుప్తా ప్రభుత్వం ఒక భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ.. మహిళా సమృద్ధి యోజన కింద అర్హులైన ప్రతి మహిళ ఖాతాలో నగదు జమ చేయనుంది. రక్షాబంధన్ కానుకగా ప్రధాని మోదీ ఈ మెగా స్కీమ్ ప్రారంభిస్తారు.

మహిళలకు రక్షాబంధన్ గిఫ్ట్.. ప్రతి నెలా అకౌంట్‌లోకి రూ.2500.. ఆ ప్రభుత్వం కీలక నిర్ణయం..
Delhi Lakshmi Yojana Scheme 2026

Edited By:

Updated on: Jul 07, 2026 | 12:31 PM

ఢిల్లీలో ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు రక్షాబంధన్ సందర్భంగా రేఖా గుప్తా ప్రభుత్వం భారీ కానుకను అందించనుంది. మహిళా సమృద్ధి యోజనను అధికారికంగా ఢిల్లీ లక్ష్మి యోజన పేరుతో అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం కింద అర్హులైన మహిళల బ్యాంకు ఖాతాల్లోకి ప్రతి నెలా రూ. 2500 జమ చేయనున్నారు. ఆగస్టు 28న రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం ముమ్మర సన్నాహాలు చేస్తోంది.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ముఖ్యమైన హామీ

గతేడాది జరిగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మహిళకు ఇచ్చిన కీలక హామీల్లో మహిళా సమృద్ధి యోజన ఒకటి. ఏడాదిన్నర పాలన పూర్తయినా మహిళలకు ఆర్థిక సహకారం అందించే పథకాన్ని అమలు చేయలేదని ఆప్ విమర్శలు గుప్పిస్తుంది. అయితే మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలు చేసే ఈ పథకం కోసం 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రూ.5,100 కోట్లకు పైగా నిధులు కేటాయించారు. ఢిల్లీ వ్యాప్తంగా సుమారు 17 నుంచి 22 లక్షల మంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతారని అంచనా వేస్తున్నారు. పారదర్శకత కోసం ప్రత్యేక ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్, మొబైల్ యాప్‌ను సిద్ధం చేశారు. లబ్ధిదారుల డేటా ధృవీకరణ తర్వాత మధ్యవర్తులు లేకుండా నేరుగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా మొత్తం జమ చేస్తారు.

ఎవరెవరు అర్హులంటే ?

ఈ పథకం కింద లాభం పొందాలంటే మహిళల వయస్సు 21 నుంచి 59 సంవత్సరాల మధ్య ఉండాలి. ఢిల్లీలో శాశ్వత నివాసి అయి ఆధార్ కార్డు, ఓటర్ ఐడీ తప్పనిసరిగా కలిగి ఉండాలి. దారిద్ర్య రేఖకు దిగువన లేదా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందినవారు అయి ఉండాలి. రేషన్ కార్డు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే కుటుంబాల మహిళలు, ఇప్పటికే ఇతర ప్రభుత్వ పెన్షన్ పథకాల లబ్ధిదారులు, సొంత కారు ఉన్న కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. ఒక కుటుంబంలో కేవలం ఒక్క మహిళకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా ఢిల్లీలోని లక్షలాది పేద మహిళలు ఆర్థిక సాధికారత సాధించి, స్వయం సమృద్ధి వైపు అడుగులు వేస్తారని ప్రభుత్వం భావిస్తుంది

Follow Us