PM Modi: ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశాం.. రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..

లక్నోలో రాష్ట్రీయ ప్రేరణాస్థల్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. వాజ్‌పేయి, దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయా, శ్యామాప్రసాద్‌ ముఖర్జీల 65 అడుగుల విగ్రహాలను ఆవిష్కరించారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

PM Modi: ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశాం.. రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించిన ప్రధాని మోదీ..
Pm Modi Inaugurates Rashtra Prerna Sthal

Updated on: Dec 25, 2025 | 9:17 PM

వాజ్‌పేయి 101 జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్నోలో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ హాజరయ్యారు. ప్రేరణా స్థల్‌లో 65 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారతమాత విగ్రహానికి నివాళి అర్పించారు. రూ.230 కోట్లతో రాష్ట్రీయ ప్రేరణా స్థల్‌ను ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ప్రేరణా స్థల్‌లో జరిగిన సభకు లక్షలాదిమంది హాజరయ్యారు. వాజ్‌పేయి విగ్రహంతో పాటు దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయా, శ్యామాప్రసాద్‌ ముఖర్జీల 65 అడుగుల విగ్రహాలను ఆవిష్కరించారు. ప్రేరణా స్థల్‌లో మ్యూజియాన్ని కూడా ప్రారంభించారు. బీజేపీ చరిత్రకు సంబంధించిన కీలక ఘట్టాలను మ్యూజియంలో పొందుపర్చారు.

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి.. శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశాం..

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ స్వప్నాన్ని సాకారం చేశామన్నారు మోదీ. జమ్ముకశ్మీర్‌లో భారత రాజ్యాంగాన్ని అమలు చేశామన్నారు. కోట్లాదిమందిని పేదరికం నుంచి విముక్తి చేశామని మోదీ ఈ సందర్భంగా పేర్కొన్నారు.. యూపీలో డిఫెన్స్‌ కారిడార్‌ ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు చిట్టచివరి వ్యక్తి వరకు అందేలా చూస్తున్నామన్నారు మోదీ. డాక్టర్‌ శ్యామా ప్రసాద్‌ ముఖర్జీ దేశంలో రెండు రాజ్యాంగాలను వ్యతిరేకించారని.. ఆర్టికల్‌ 370ని రద్దు చేసే అవకాశం బీజేపీకి రావడం ఆనందంగా ఉందన్నారు.

కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు మోదీ. గతంలో ఒకే కుటుంబం పేరుతో పథకాలు అమలు చేశారన్నారు. తాము మాత్రం మహనీయులను గౌరవిస్తు్న్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..