తీహార్ జైలుకు చిదంబరం.. 14 రోజుల కస్టడీ!

|

Sep 06, 2019 | 12:26 AM

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయన్ని అధికారులు కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి అజయ్ కుమార్ ఈ నెల 19 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. ఇక అంతవరకూ చిదంబరం తీహార్ జైలులో ఉండనున్నారు. అంతేకాకుండా ఆయన తన పుట్టినరోజు నాడు కూడా అక్కడే గడపనున్నారు. మరోవైపు చిదంబరానికి జైలులో ప్రత్యేక గది, సరైన రక్షణ కల్పించాలని […]

తీహార్ జైలుకు చిదంబరం.. 14 రోజుల కస్టడీ!
Follow us on

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని తీహార్ జైలుకు తరలించారు. రెండు రోజుల సీబీఐ కస్టడీ ముగియడంతో ఆయన్ని అధికారులు కోర్టులో హాజరు పరచగా.. న్యాయమూర్తి అజయ్ కుమార్ ఈ నెల 19 వరకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీని విధించారు. ఇక అంతవరకూ చిదంబరం తీహార్ జైలులో ఉండనున్నారు. అంతేకాకుండా ఆయన తన పుట్టినరోజు నాడు కూడా అక్కడే గడపనున్నారు.

మరోవైపు చిదంబరానికి జైలులో ప్రత్యేక గది, సరైన రక్షణ కల్పించాలని ఆయన తరపున న్యాయవాది కపిల్ సిబల్ కోర్టును కోరారు. దానికి కోర్టు అంగీకరించగా.. వెస్ట్రన్ టాయిలెట్‌ సౌకర్యంతో పాటు అవసరమైన మందులు కూడా అందించేందుకు అనుమతించింది. ‘ఆర్ధిక వ్యవస్థ పతనమే ఆవేదన కలిగిస్తోందని.. జైలు గురించి తనకేమి బాధలేదని’ చిదంబరం మీడియాతో తెలిపారు.

అంతకముందు చిదంబరానికి కోర్టులో చుక్కెదురైంది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆయన పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును జస్టిస్ భానుమతి, జస్టిస్ ఏఎస్ బోపన్నతో కూడిన ధర్మాసనం కూడా సమర్ధించింది. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తే అది దర్యాప్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంటుందని వారు అభిప్రాయపడ్డారు. మరోవైపు సీబీఐ కస్టడీని సవాల్‌ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోగా.. అందుకు ధర్మాసనం కూడా అంగీకరించింది.

2007లో చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్న సమయంలో తన కుమారుడు కార్తీ చిదంబరానికి లబ్ది చేకూరేలా అక్రమాలకు పాల్పడ్డారు. దీనిపై ఆయన్ని గత నెల 21న సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.