Rahul Gandhi: రాజస్థాన్‌ సీఎంగా సచిన్‌ పైలట్‌కు రూట్‌ క్లియర్..! రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. దీనిపై ,భారత్‌ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. అధ్యక్ష పదవికి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు రాహుల్‌.

Rahul Gandhi: రాజస్థాన్‌ సీఎంగా సచిన్‌ పైలట్‌కు రూట్‌ క్లియర్..! రాహుల్‌ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు
Rahul Gandhi

Updated on: Sep 23, 2022 | 5:55 AM

Rahul Gandhi on Congress Election: కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలయ్యింది. దీనిపై ,భారత్‌ జోడో యాత్రలో కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ. అధ్యక్ష పదవికి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు రాహుల్‌. ఒక వ్యక్తి.. ఒకే పదవి అన్న నిబంధనకు అందరూ నేతలు కట్టుబడి ఉండాలన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్ష బరిలో దిగుతున్న రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ను ఉద్దేశించి రాహుల్‌ ఆ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ అధ్యక్ష పదవి ఓ పార్టీకి సంబంధించి కాదని , అది చారిత్రాత్మక పదవి అని అన్నారు రాహుల్‌. ఆ పార్టీ పదవి చేపట్టేవాళ్లు సిద్దాంతాలకు కట్టుబడి పనిచేయాలని సూచించారు. తాము ఈ సంవత్సరం ప్రారంభంలో ఉదయపూర్‌లో నిర్వహించిన చింతన్ శిబిర్ సమయంలో ఏమి నిర్ణయించుకున్నామో.. ఆ నిబద్ధతనే అందరూ కొనసాగించాలని ఆశిస్తున్నట్లు రాహుల్ చెప్పారు. రాహుల్‌ వ్యాఖ్యలతో సచిన్‌ పైలట్‌ (Sachin Pilot) కు రాజస్థాన్‌ సీఎం కావడడానికి రూట్‌ క్లియర్‌ అయినట్టు కాంగ్రెస్‌ వార్తలు చెబుతున్నారు. కొచ్చిలో రాహుల్‌తో అశోక్‌ గెహ్లాట్‌ (Ashok Gehlot) భేటీ అయ్యారు. సీఎం పదవికి రాజీనామా చేసేందుకు గెహ్లాట్‌ ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. అయితే సీఎంగా సచిన్‌ పైలట్‌ను ఎంపిక చేయడాన్ని ఇప్పటికి కూడా ఆయన వ్యతిరేకిస్తునట్టు చెబుతున్నారు. రాజస్థాన్‌ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషిని సీఎం చేయాలని రాహుల్‌కు ఆయన సూచించినట్టు సమాచారం. కాని కాంగ్రెస్‌ హైకమాండ్‌ మాత్రం సచిన్‌ పైలట్‌కే సీఎం పగ్గాలు ఇచ్చేందుకు ఒప్పుకున్నట్టు చెబుతున్నారు.

కేరళలో రాహుల్‌ పాదయాత్రలో పాల్గొన్నారు సచిన్‌ పైలట్‌. రాజస్థాన్‌లో చాలాకాలం నుంచి పైలట్‌ -గెహ్లాట్‌ వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సచిన్‌ పైలట్‌కు తప్పకుండా సీఎం పదవి ఇస్తామని గతం లోనే ప్రామిస్‌ చేశారు ప్రియాంకగాంధీ. అందుకే ఆయన్ను సీఎం చేసి ఒక దెబ్బకు రెండు పిట్టలను కొట్టాలన్న వ్యూహాంతో ఉన్నారు రాహుల్‌గాంధీ. కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఎవరవుతారన్న విషయంపై కాంగ్రెస్‌ నేతలు తలపట్టుకుంటున్న సమయంలో గెహ్లాట్‌కు పగ్గాలు అప్పగించాలన్న ఆలోచనలో సోనియా,రాహుల్‌ ఉన్నారు. అందుకే ఆయన్ను అధ్యక్ష ఎన్నికల బరిలో దింపుతున్నారు. మరోవైపు సచిన్‌ పైలట్‌కు సీఎం పదవి ఇస్తే మధ్యప్రదేశ్‌ సీన్‌ రిపీట్‌ కాకుండా చూసుకోవచ్చన్న ఆలోచన కాంగ్రెస్‌ నేతలకు ఉంది. రాహుల్‌ భారత్‌ జోడో యాత్ర 14వ రోజుకు చేరుకుంది. కొచ్చిలో పాదయాత్ర చేశారు రాహుల్‌. 320 కిలోమీటర్ల మేర రాహుల్‌ పాదయాత్ర ఇప్పటివరకు కొనసాగింది.

అక్టోబర్ 17న కాంగ్రెస్ ఎన్నికలు..

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికల కోసం గురువారం నోటిఫికేషన్‌ విడుదల అయింది. సుదీర్ఘకాలం పాటు పనిచేసిన అధినేత్రి సోనియా గాంధీ వారసుడిని ఎన్నుకునేందుకు బాల్ రోలింగ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు సీనియర్ నాయకులు అశోక్ గెహ్లాట్, శశి థరూర్‌ ఈ పోటీలో ఉన్నట్లు తెలుస్తోంది. నోటిఫికేషన్ ప్రకారం, ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ సెప్టెంబర్ 24 నుంచి 30 వరకు జరుగుతుంది. నామినేషన్ పత్రాల పరిశీలన అక్టోబర్ 1 న జరుగుతుంది, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 8గా నిర్ణయించారు. ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఉంటే అధ్యక్ష ఎన్నికలు అక్టోబర్ 17 న జరుగుతాయి. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన అక్టోబర్ 19న ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us