Ashok Gehlot: కాకరేపుతున్న రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు..అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని నిర్భయ తల్లి డిమాండ్..

|

Aug 08, 2022 | 9:37 AM

రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హత్యాచారాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్లాక్ ప్రొటెస్ట్ లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ..

Ashok Gehlot: కాకరేపుతున్న రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు..అశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలని నిర్భయ తల్లి డిమాండ్..
Rajasthan CM Ashok Gahlot (File Photo)
Follow us on

Ashok Gehlot: రాజకీయ నాయకులు ఒక్కోసారి చేసే వివాదస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్నే రేపుతాయి. తాజాగా కొద్దిరోజుల క్రితం రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ హత్యాచారాలపై చేసిన కామెంట్స్ ఇప్పుడు కాకరేపుతున్నాయి. ఇటీవల ఢిల్లీలో నిరుద్యోగం, ధరల పెరుగుదలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బ్లాక్ ప్రొటెస్ట్ లో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మాట్లాడుతూ.. దేశంలో హత్యాచారాలు పెరిగిపోవడానికి చట్టాలే కారణమని వ్యాఖ్యానించారు. అత్యాచారాలకు పాల్పడేవారిని ఉరితీసే చట్టం అమల్లోకి వచ్చిన తర్వాతే దేశ వ్యాప్తంగా అత్యాచారాలు, హత్యలు ఎక్కువయ్యాయంటూ పరోక్షంగా నిర్భయ చట్టాన్ని ఉద్దేశించి మాట్లాడారు. ఈవ్యాఖ్యలపై బీజేపీతో పాటు ఇతర రాజకీయ పక్షాలు మండిపడుతున్నాయి. ఈక్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవి స్పందించారు.

ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. అశోక్ గహ్లాట్ వ్యాఖ్యలు నేరస్తులకు మద్దతిచ్చేవిగా ఉన్నాయని విమర్శించారు. అత్యాచారానికి పాల్పడేవారిని ఉరితీసే చట్టం రాకముందే ఎంతోమంది బాలికల హత్యలు జరిగాయని ఆశాదేవి గుర్తు చేశారు. ప్రజల మనస్థత్వంలో మార్పురాకపోవడమే అమ్మాయిలపై హత్యాచారాలకు కారణమని.. చట్టాలు కాదని ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ తెలిపారు. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయన వ్యాఖ్యలు ఎంతో ఇబ్బందికమైనవని.. హత్యాచార బాధితుల కుటుంబాలను ఆయన ఎగతాళి చేశారని తెలిపారు. నిర్భయ చట్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకొచ్చిందని ఆశాదేవి గుర్తు చేశారు. హత్యాచార బాధితుల పట్ల సానుభూతి లేకపోవడమే కాకుండా నిందితులకు మద్దతిచ్చేలా రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని విమర్శించారు. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పడంతో పాటు, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని ఆశాదేవి డిమాండ్ చేశారు.

తన వ్యాఖ్యలపై వివాదం రెకెత్తడంతో రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. తాను నిజం మాత్రమే మాట్లాడానని.. మహిళలపై అత్యాచారానికి పాల్పడినప్పుడు..బాధితురాలు నిందితుడిని గుర్తిస్తుందేమోననే భయంతో వారిని చంపేస్తారనే ఉద్దేశంతోనే మాట్లాడానంటూ క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..