
జనన, మరణాల నమోదును మరింత ఖచ్చితంగా, సకాలంలో చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ (సవరణ) చట్టం, 2026 అక్టోబర్ 1, 2026 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానుంది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఈ తేదీని ప్రకటించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఆమోదం పొందిన బిల్లుకి రాష్ట్రపతి ఆమోదం లభించిన తర్వాత అధికారికంగా చట్టరూపం దాల్చింది.
కొత్త నిబంధనలు ఏమిటి ?
జననం లేదా మరణం సంభవించిన తేదీ నుంచి ఆలస్యంగా నమోదు చేసుకోవాలంటే ఇకపై కఠినమైన ప్రక్రియ పాటించాల్సి ఉంటుంది. ఒక సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల మధ్య ఆలస్యమైతే జిల్లా మేజిస్ట్రేట్ (డీఎం), సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) లేదా జిల్లా మేజిస్ట్రేట్ అధికారం ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి. ఘటన సరైనదని ధృవీకరించిన తర్వాతే, నిర్దేశిత రుసుము చెల్లించి నమోదు చేస్తారు. రెండు సంవత్సరాలకు మించి ఆలస్యమైతే ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఆదేశం తప్పనిసరి.
వారు కూడా ఘటన సరైనదని ధృవీకరించి, రుసుము చెల్లించిన తర్వాతే నమోదు అనుమతిస్తారు.ప్రభుత్వం ఈ సవరణల ద్వారా ఆలస్య నమోదులపై మరింత పర్యవేక్షణ, ధృవీకరణ ఉండేలా చర్యలు తీసుకుంటోంది. జనన, మరణ రికార్డులను సకాలంలో నమోదు చేయాలని ప్రజలను ప్రోత్సహించడమే దీని ముఖ్య లక్ష్యం.సాధారణంగా జననం లేదా మరణం 21 రోజుల్లోపు నమోదు చేయాలి.
ఆలస్యమైతే రాష్ట్ర నిబంధనల ప్రకారం లేట్ ఫీజు, అనుమతి అవసరం. కొత్త చట్టం ప్రధానంగా ఒక సంవత్సరం తర్వాత జరిగే ఆలస్య నమోదులకు వర్తిస్తుంది.ప్రజలు తమ ప్రాంతీయ రిజిస్ట్రార్ లేదా జిల్లా పరిపాలన కార్యాలయం నుంచి తాజా వివరాలు, రుసుము వివరాలు తెలుసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.