Train Accident: మళ్లీ అదే తప్పు.. భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక అదే నిర్లక్ష్యం! పట్టాలపై ఎగిరిపడ్డ భోగీలు..

|

Oct 12, 2024 | 9:37 AM

తమిళనాడు శివారులో శుక్రవారం (అక్టోబర్‌ 11) రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు వేగంగా వచ్చి, ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు.. పట్టాలపై ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీ కొట్టింది..

Train Accident: మళ్లీ అదే తప్పు.. భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదం వెనుక అదే నిర్లక్ష్యం! పట్టాలపై ఎగిరిపడ్డ భోగీలు..
Chennai Train Accident
Follow us on

చెన్నై, అక్టోబర్ 12: తమిళనాడు శివారులో శుక్రవారం (అక్టోబర్‌ 11) రాత్రి భారీ రైలు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు రైళ్లు వేగంగా వచ్చి, ఒకదానికొకటి ఢీ కొట్టుకున్నాయి. మైసూరు నుంచి తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మీదుగా దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ (12578) రైలు.. పట్టాలపై ఆగివున్న గూడ్స్‌ రైలును వేగంగా ఢీ కొట్టింది. తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరైపెట్టై రైల్వేస్టేషన్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రైలు భోగీలు ఎగిరిపడ్డాయి. మరికొన్ని చెల్లాచెదురుగా పడిపోయాయి. దాదాపు 13 వరకు కోచ్‌లు పట్టాలు తప్పాయి. భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ముందు భాగంలో అన్నీ ఏసీ కోచ్‌లు ఉండటంతో అందులోని ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో ఆయా భోగీల్లోని ప్రయాణికుల హాహాకారాలతో భీతావాహకంగా మారింది అక్కడి పరిస్థితి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పరుగుపరుగున వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని దక్షిణ రైల్వే ప్రకటించింది. చెన్నై రైల్వే డివిజన్‌ 044 2535 4151, 044 2435 4995 ఫోన్‌ నంబర్లతో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పింది. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని రైల్వే డివిజన్‌లు కూడా అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్‌లను విడుదల చేశాయి. గూడూరు 08624 250795, ఒంగోలు 08592 280306, విజయవాడ 0866 2571244, నెల్లూరు 0861 2345863.. హెల్ప్ లైన్ నెంబర్లను ఏర్పాట్లు చేశాయి. గాయపడిన ప్రయాణికులను సమీపంలోని పలు ఆసుపత్రులకు చికిత్స నిమిత్తం తరలించారు. మిగతా ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ రవాణా ఏర్పాట్లు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది.

ఇవి కూడా చదవండి

కాగా గతేడాది యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిన ఒడిశా మూడు రైళ్లు ఢీ కొట్టిన ప్రమాదం ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతూనే ఉంది. ఈ ప్రమాదంలో వందల సంఖ్యలో ప్రయాణికులు మృతి చెందారు. గ్రీన్‌ సిగ్నల్స్‌ పడటం, రైలు ట్రాక్‌ మారడం వంటి కారణాలతో ప్రమాదం జరిగినట్లు అప్పట్లో రైల్వే అధికారులు తేల్చారు. అయితే తాజాగా తమిళనాడులో జరిగిన ప్రమాదంలోనూ సరిగ్గా అదే తప్పిదం జరిగినట్లు తెలుస్తోంది. రాత్రి 8.27 సమయంలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ పొన్నేరి స్టేషన్‌ దాటి.. కవరైపెట్టై స్టేషన్‌కు వస్తున్న క్రమంలో మెయిన్‌ లైనుపై నుంచి లూప్‌లైన్‌లోకి వెళ్లింది. అదే సమయంలో ఎక్స్‌ప్రెస్‌ రైలుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. దీంతో లూప్‌ లైన్‌లో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఎక్స్‌ఫ్రెస్‌ రైలు వేగంగా ఢీకొట్టింది. ప్రమాద సమయంలో రైలు వేగం గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదం ధాటికి రెండు రైళ్లలో మంటలు చెలరేగాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.