మోర్బి కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదంలో ముగిసిన సెర్చ్‌ ఆపరేషన్.. కీలక విషయాలు వెలుగులోకి.. అసలేం జరిగిందంటే..!

|

Nov 04, 2022 | 7:25 AM

బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాన్ని విచారణ అధికారులు బయటపెట్టారు. బ్రిడ్జి మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. నిర్మాణాన్ని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉండగా..

మోర్బి కేబుల్‌ బ్రిడ్జి ప్రమాదంలో ముగిసిన సెర్చ్‌ ఆపరేషన్.. కీలక విషయాలు వెలుగులోకి.. అసలేం జరిగిందంటే..!
Morbi Cable Bridge
Follow us on

గుజరాత్‌లోని మోర్బీ కేబుల్‌ బ్రిడ్జి ప్రమాద ఘటనకు సంబంధించిన సెర్చ్ ఆపరేషన్‌ ముగిసింది. ఈ మేరకు గుజరాత్ ప్రభుత్వం గురువారం ప్రకటించింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 135కు చేరింది. సెర్చ్ ఆపరేషన్ మూసిన సంఘటనపై ప్రభుత్వం అధికారిక ప్రకటనలో తెలియజేసింది. రాష్ట్ర విపత్తు కమిషనర్ హర్షద్ పటేల్ గురువారం మోర్బీని సందర్శించారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ముగిసినట్లు ప్రకటించారు. ఆదివారం ప్రమాదం జరిగిన వెంటనే సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వివిధ ఏజెన్సీల అధిపతులతో హర్షద్ పటేల్ అధ్యక్షతన సమావేశమై పరిస్థితిని సమీక్షించిన తర్వాత ఆపరేషన్ ముగిసిందని ప్రకటించారు. అయితే, ముందుజాగ్రత్తగా, స్థానిక అగ్నిమాపక శాఖ, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF), జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) నుండి ఒక్కొక్క బృందం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రమాద స్థలంలో అందుబాటులో ఉంటారు.

గుజరాత్‌లోని మోర్బీ నగరంలో గత ఆదివారం మచ్చు నదిపై బ్రిటిష్ కాలం నాటి కేబుల్ వంతెన అకస్మాత్తుగా కూలిపోయింది. ప్రమాదంలో వందలాది మంది నదిలో కొట్టుకుపోయారు. ఇందులో ఇప్పటి వరకు మహిళలు, చిన్నారులు సహా మొత్తం 135 మంది మరణించినట్లు అధికారికంగా నిర్ధారించారు. గల్లంతైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. కానీ, ఫలితం లేకుండా పోయింది. చాలా మంది ఆచూకీ లభించలేదు.

ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు కొందరిని అరెస్టు చేశారు. ఇందులో బ్రిడ్జిని నిర్వహిస్తున్న ఒరేవా గ్రూప్‌కు చెందిన ఇద్దరు మేనేజర్లు సహా మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాలుగు రోజుల పోలీసు కస్టడీకి కోర్టు పంపింది. దీంతో పాటు మరో ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. ఈ కేసులో ఇప్పటి వరకు నమోదైన 9 మంది అరెస్ట్‌లలో దీపక్ పరేఖ్ (ఒరేవా కంపెనీ మేనేజర్), దినేష్‌భాయ్ మహాసుఖరాయ్ దవే దినేష్‌భాయ్ మహాసుఖరాయ్ దవే, మన్సుఖ్ బల్జీభాయ్ టోపియా (టికెట్ క్లర్క్), మాదేవ్‌భాయ్ లఖాభాయ్ సోలంకి (టికెట్ క్లర్క్), కాంట్రాక్టర్ ప్రకాష్భా పర్మార్ ఉన్నారు. ఈ క్రమంలోనే బ్రిడ్జి ప్రమాదానికి సంబంధించి కీలక విషయాన్ని విచారణ అధికారులు బయటపెట్టారు. బ్రిడ్జి మరమ్మతుల విషయంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని ప్రాథమికంగా తేల్చారు. నిర్మాణాన్ని శాస్త్రీయంగా పరీక్షించాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ అలాంటిదేమీ నిర్వహించలేదని వెల్లడిరచారు. తీగలకు రంగులేసి, మార్బుల్స్‌ ను పాలిష్‌ చేసి మరమ్మతులు పూర్తయినట్లు చూపించారన్నారు. మేరకు విచారణ కమిటీలోని పోలీసు అధికారి ఒకరు ఈ వివరాలను వెల్లడిరచారు.

ఇవి కూడా చదవండి

ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని, బ్రిడ్జి శిథిలాలను పరిశీలించి ఈ విషయాలను గమనించినట్లు సదరు అధికారి తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు.దాదాపు 143 ఏళ్లనాటి బ్రిడ్జి కావడంతో మరమ్మతుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందని దర్యాప్తు అధికారి అభిప్రాయపడ్డారు. వంతెన పునర్నిర్మాణ పనులకు డిసెంబర్‌ దాకా గడువు ఉన్నప్పటికీ ఏడు నెలలలోపే హడావుడిగా పనులు ఎందుకు పూర్తిచేయాల్సి వచ్చిందనేది విచారిస్తామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ  క్లిక్ చేయండి