
అక్రమ సంబంధాలు పచ్చని కాపురాల్లో చిచ్చు పెడుతున్నాయి. క్షణిక సుఖం కోసం తీసుకున్న నిర్ణయాలు నిండు ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. గుజరాత్లోని రాజ్కోట్లో సరిగ్గా ఇలాంటి ఘటనే జరిగింది. సొంత మేనల్లుడితో భార్యను అనుచిత స్థితిలో చూసిన భర్త, ఆవేదన తట్టుకోలేక తుపాకీతో భార్యను కాల్చి, తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
నాగేశ్వర్ ప్రాంతానికి చెందిన లాల్జీ, త్రిష దంపతులకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 18 ఏళ్ల కొడుకు ఉన్నాడు. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో లాల్జీ మేనల్లుడు విశాల్ ఆ ఇంటికి రావడం మొదలుపెట్టాడు. భర్త ఇంట్లో లేని సమయంలో త్రిష, విశాల్తో చనువుగా ఉండేది. ఒకరోజు లాల్జీ అనుకోకుండా త్వరగా ఇంటికి వచ్చి..నేరుగా బెడ్రూమ్లోకి వెళ్లేసరికి, అక్కడ తన భార్య, మేనల్లుడు అభ్యంతరకర స్థితిలో కనిపించారు. ఆ దృశ్యం చూసి లాల్జీ కాళ్ల కింద భూమి కదిలినట్టయింది.
ఈ సంఘటన తర్వాత త్రిష ఇల్లు వదిలి తన స్నేహితురాలు పూజ దగ్గరికి వెళ్లిపోయింది. అయితే కొన్నాళ్ల తర్వాత లాల్జీ మనసు మార్చుకున్నాడు. 20 ఏళ్ల బంధాన్ని, కొడుకు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భార్యను క్షమించడానికి సిద్ధపడ్డాడు. ఆమె కోసం ఆస్తి, నగలు, ఇల్లు అన్నీ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. తిరిగి ఇంటికి రమ్మని ప్రాధేయపడ్డాడు. కానీ త్రిష స్నేహితురాలు పూజ, మేనల్లుడు విశాల్ ఆమెను వెనక్కి వెళ్ళనివ్వలేదని ఆరోపణలు ఉన్నాయి. పైగా నెల క్రితం లాల్జీపై పోలీసు కేసు పెట్టి అరెస్టు కూడా చేయించారు. భార్యను ఎంత బతిమాలినా వినకపోవడం, ఎదురు కేసులు పెట్టడంతో లాల్జీ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
ఈ క్రమంలో లాల్జీ ఆవేశంతో రగిలిపోయాడు. భార్య త్రిష ఉంటున్న నివాసానికి వెళ్లిన లాల్జీ.. ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు. ఆమె కుప్పకూలిన వెంటనే, తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలోనే లాల్జీ మరణించగా, త్రిష పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతోంది. కుటుంబ కలహాలు, వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.