Mamata Banerjee Meets PM Narendra Modi: ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో.. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుక్రవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి రావాల్సిన జీఎస్టీ బకాయిలు, పలు పథకాల కింద అందాల్సిన నిధులను విడుదల చేయాలని కోరారు. నీతి ఆయోగ్ సమావేశానికి హాజరయ్యేందుకు గురువారం మమతా ఢిల్లీ చేరుకున్నారు. నాలుగు రోజుల పర్యటనలో మమతా విపక్షపార్టీల నేతలతో, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో కూడా సమావేశం కానున్నారు. ఈ మేరకు ప్రధాని మోడీని కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మమతా వివరించారు. ఉపాధి పథకం, పీఎం ఆవాస్ యోజన, పీఎం గ్రామీణ సడక్ యోజనతో సహా పథకాల అమలు కోసం రాష్ట్రానికి రావాల్సిన నిధులను విడుదల చేయాలని మమతా ఈ సందర్భంగా కోరారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.17,996 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని మోడీకి మమతా లేఖ అందించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల నుంచి సుమారు రూ.1,00,968.44 కోట్లు రావాల్సి ఉందని వివరించారు. కాగా.. బీజేపీ పాలిత రాష్ట్రాలకు కేంద్రం బకాయిలను సకాలంలో అందించి.. ప్రతిపక్షాలు పాలిస్తున్న రాష్ట్రాలకు జిఎస్టి బకాయిలను ఆలస్యం చేస్తోందని బెంగాల్ ముఖ్యమంత్రి తరచుగా ఆరోపిస్తున్నారు. జూన్లో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ప్రధాన ముఖ్య సలహాదారు అమిత్ మిత్రా సైతం రాష్ట్రాలకు రూ. 27,000 కోట్ల సమగ్ర బకాయిలను కేంద్రం విడుదల చేయలేదని ఆరోపించారు.
అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పార్థ ఛటర్జీని అరెస్టు చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ సమావేశం చాలా ఊహాగానాలకు దారితీసింది. తన సహాయకురాలు అర్పితా ముఖర్జీ ఇంట్లో కోట్లాది రూపాయల నగదు దొరకడంతో మంత్రి కూడా అరెస్టు అయ్యారు. ఈ క్రమంలో మమతా.. పీఎం మోడీతో భేటీ కావడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం