మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. 6 గంటల పాటు భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు ఎన్కౌంటర్ స్థలం నుంచి భారీగా ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో 12 మంది మావోయిస్టులు హతమయ్యారు. చనిపోయిన వారిలో మావోయిస్టు అగ్రనేతలూ ఉన్నారు. ఇక ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతంలో భారీగా అత్యాధునిక ఆయుధాలను భద్రతా బలగాలు, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం సమీపంలో దాదాపు 12 నుంచి 15 మంది మావోయిస్టులు దాక్కొని ఉన్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో భారీ బందోబస్తుతో డిప్యూటీ ఎస్పీ సారథ్యంలోని పోలీసులు బుధవారం ఉదయం ఆపరేషన్ ప్రారంభించారు. వర్షం కురుస్తున్నప్పటికీ, మావోయిస్టులు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. ఇక పోలీసు బలగాల రాకను గుర్తించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు. వెంటనే బలగాలు కూడా ఎదురు కాల్పులకు దిగడంతో 12 మంది మావోయిస్టులు చనిపోయారు. పలువురు పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. వారికోసం గాలింపు ముమ్మరం చేశామన్నారు.
ఇక సంఘటనా స్థలంలో 7 ఏకే 47 తుపాకీలతో పాటు పలు హై టెక్నాలజీ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగడ్ దళం ఇంఛార్జ్ లక్ష్మణ్ ఆత్రం అలియాస్ విశాల్ ఆత్రం ఉన్నట్లు తెలిపిన పోలీసులు, మిగతా మృతదేహాలను గుర్తించే పనిలో పడ్డారు. అలాగే ఈ ఎదురుకాల్పుల్లో ఎస్ఐతో సహా ఇద్దరు జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని హెలికాప్టర్ ద్వారా గడ్చిరోలికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు.
మొత్తంగా… మావోయిస్టుల ఏరివేతను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్రంలోని మోడీ సర్కారు.. మరిన్ని బలగాలతో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో వరుస కూంబింగులు చేపడుతోంది. కేంద్ర బలగాలనూ రంగంలోకి దించుతోంది. మూకుమ్మడి దాడులు చేయడంలో సిద్ధహస్తులైన బ్లాక్ క్యాట్స్ను సైతం మావోయిస్టుల ఏరివేతకు వాడుతున్నట్లు తెలుస్తోంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..