Lumpy Skin Disease: ఆ రాష్ట్రాలను వణికిస్తున్న లంపీ స్కిన్‌ వైరస్‌.. వేల సంఖ్యలో పశువుల మృత్యువాత..

|

Aug 06, 2022 | 8:13 AM

రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు లంపీ స్కిన్‌ వైరస్‌తో అల్లాడిపోతున్నాయి. రాజస్థాన్‌లో దాదాపు లక్ష ఆవులకు లంపీ స్కిన్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది.

Lumpy Skin Disease: ఆ రాష్ట్రాలను వణికిస్తున్న లంపీ స్కిన్‌ వైరస్‌.. వేల సంఖ్యలో పశువుల మృత్యువాత..
Lumpy Skin Disease
Follow us on

Lumpy Skin Disease: భారతదేశాన్ని మరో కొత్త వైరస్‌ వణికిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా పశువులకే వ్యాపిస్తుంది. రాజస్థాన్‌, గుజరాత్‌ రాష్ట్రాలు లంపీ స్కిన్‌ వైరస్‌తో అల్లాడిపోతున్నాయి. రాజస్థాన్‌లో దాదాపు లక్ష ఆవులకు లంపీ స్కిన్‌ వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయింది. ఈ వ్యాధి బారిన 4,500 ల ఆవులు చనిపోవడం కలవరం రేపుతోంది. రాష్ట్రంలో 16 జిల్లాలకు లంపీ స్కిన్‌ వైరస్‌ విస్తరించినట్లు గుర్తించారు. గుజరాత్‌లో 70 వేల ఆవులకు లంపీ స్కిన్‌ వ్యాధి సోకింది. ఇక్కడ 18 వందల ఆవులు మృత్యువాత పడ్డాయి. గుజరాత్‌లోని 22 జిల్లాల్లో ఈ వ్యాధిని గుర్తించారు. ఈ రెండు రాష్ట్రాల్లోనూ లంపీ స్కిన్‌ కారణంగా పాల సేకరణ పడిపోయింది. రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు దేశంలో దాదాపు 6వేల పశువులు మరణించినట్లు పేర్కొంటున్నారు.

ఈగల కారణంగా వైరస్‌ పశువులకు వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. వ్యాధి సోకి ఆవుల చర్మంపై ఎర్రగా బొడిపెలు కనిపిస్తున్నాయి. ఇవి పుండ్లుగా మారి శరీరమంతా వ్యాపిస్తాయి. దీంతో తీవ్ర జ్వరం వచ్చి.. పశువులు పాలు ఇవ్వడం, గడ్డి తినడం మానేస్తాయి. లంపీస్కిన్‌ డిసీజ్‌ను ముందు పాకిస్తాన్‌లో గుర్తించారు. అక్కడి నుంచి భారత్‌ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్‌, గుజరాత్‌లకు విస్తరించిందని చెబుతున్నారు. లంపీస్కిన్‌ వైరస్‌ విషయంలో రాజస్థాన్‌, గుజరాత్‌ ప్రభుత్వాలు ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. గుజరాత్‌ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌ లంపీస్కిన్‌ తీవ్రత అధికంగా ఉన్న కచ్‌ జిల్లాలో పర్యటించారు. ఈ వైరస్‌ విస్తరించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశాంచారు.

రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కూడా లంపీ స్కిన్‌పై సమీక్ష జరిపి అధికారులను అప్రమత్తం చేశారు. రాష్ట్ర పశు సంవర్ధక శాఖలో సిబ్బంది కొరత మరింత కలవరపెడుతోంది. రాష్ట్రంలోని ఆవులను లంపీస్కిన్‌ నుంచి రక్షించడానికి ఆర్ధిక సాయం అందించాని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలోని గోశాలల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్చంద సంస్థలు లంపీ స్కిన్‌ డిసీజ్‌ను నియంత్రించడంలో సహకరించాలని గెహ్లాట్‌ విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం..