
మొబైల్ ఈఎంఐ కట్టలేదనే కారణంతో మొబైల్ షాప్ నిర్వాహకులు ఏకంగా ఓ యువకుడి రక్తాన్నే అమ్ముకున్న ఘటన యూపీ రాజధాని లక్నోలో వెలుగుచూసింది. విషయం పోలీసుల దృష్టికి చేరడంతో నిందితులను అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసముంటున్న నావల్కుమార్ అనే యువకుడు ఈ మధ్యే లక్నోలోని ఓ మొబైల్ షాప్లో ఈఎంఐపై ఒక ఫోన్ కొనుగోలు చేశాడు. అయితే అతను ఫోన్కు ప్రతి నెలా రూ. 2,799 EMI కట్టాల్సి ఉంది.
ఆర్థిక ఇబ్బందుల కారణంగా అతను మధ్యలో ఒక నెల ఈఎంఐని కట్టలేదు. దీంతో షాపు నిర్వాహకులైన అనికేత్ సింగ్, సుశాంత్ శర్మ అనే ఇద్దరు వ్యక్తులు నావల్ కుమార్ను షాపు వద్దకు రమ్మని పిలిచారు. తీరా అతను అక్కడికి వెళ్లిన తర్వాత నావల్ను పట్టుకొని శుభమ్సింగ్ అనే వ్యక్తి ఇంటికి తీసుకెళ్లి అక్కడే బంధించారు. సుమారు నాలుగు రోజుల పాటు అతన్ని హింసించి.. అంతేకాదు అతన్ని ఓ బ్లడ్బ్యాంక్కు తీసుకెళ్లి అతని శరీరంలోని రక్తాన్ని సైతం అమ్ముకున్నారు. ఇంత చేసి అతన్ని వదిలేశారా అంటే అదీ లేదు.. చివరకు అతను కట్టాల్సిన EMI డబ్బులు తీసుకొని మరీ నావల్ను వదిలేశారు నిందితులు.
ఇక ఇంటికి చేరుకున్న నావల్ జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అతని తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. శుభమ్ అనే మరో యువకుడు పరారీలో ఉన్నట్టు గుర్తించారు. ఫోన్ EMI కట్టనందుకు అతనికి గుణపాఠం చెప్పాలనే ఉద్దేశంతోనే నావల్కుమార్ను బంధించి హింసించినట్టు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.