
Weather Update: భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ ఊరటనిచ్చే ప్రకటన చేసింది. దక్షిణ అండమాన్ సముద్రం ఆ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న మూడు రోజుల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. వాయువ్య దిశగా కదులుతున్న అల్పపీడనం రాగల 48గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. దీని ప్రభావంతో రాగల మూడు రోజుల పాటు తమిళనాడు, కోస్తాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడతాయన్నారు.
ఇక ఉత్తర కోస్తాంధ్ర ప్రాంతాలైన తూర్పుగోదావరి జిల్లాలో, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, యానాం ప్రాంతాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయితే కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు కురుస్తు్న్నాయని, 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఒకట్రెండు చోట్ల ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది. ఈ మూడు రోజుల వర్షాల కారణంగా రైతులు తమ ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈదురు గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. గడిచిన 24 గంటల్లో రాయలసీమలోని కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత 41.6 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. అత్యధిక వర్షపాతం తిరుపతిలో 38.5 మిల్లీ మీటర్లుగా నమోదైందని తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి: