
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) వర్గానికి చెందిన ఆరుగురు తిరుగుబాటు లోక్సభ సభ్యులను ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో విలీనం చేసేందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఆమోదం తెలిపారు. ఈ మేరకు లోక్సభ సచివాలయం అధికారిక గుర్తింపు ఇవ్వడంతో షిండే వర్గానికి పార్లమెంట్లో మరింత బలం చేకూరింది.
ఈ నిర్ణయంతో ఏక్నాథ్ షిండే వర్గానికి చెందిన లోక్సభ సభ్యుల సంఖ్య 13కు పెరిగింది. మరోవైపు ఉద్ధవ్ థాకరే వర్గానికి ఇది గట్టి రాజకీయ ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇటీవలే ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో ఉద్ధవ్ వర్గానికి చెందిన ఆరుగురు ఎంపీలు అధికారికంగా శివసేనలో చేరిన విషయం తెలిసిందే. అనంతరం ఆ ఎంపీలను తమ పార్టీ శాసనపరమైన విభాగంలో విలీనం చేయాలని షిండే వర్గం లోక్సభ స్పీకర్ను కోరింది.
అవసరమైన నిబంధనలు, పత్రాలను పరిశీలించిన అనంతరం లోక్సభ సచివాలయం విలీనానికి ఆమోదం తెలిపింది. దీంతో తిరుగుబాటు ఎంపీలకు అధికారిక గుర్తింపు లభించింది. ఈ పరిణామం మహారాష్ట్ర రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా ఏక్నాథ్ షిండే తన’ఆపరేషన్ టైగర్’ విజయవంతమైందని పేర్కొన్నారు. శివసేనను మరింత బలోపేతం చేసే దిశగా ఈ విలీనం కీలక అడుగని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు ఉద్ధవ్ థాకరే వర్గం మాత్రం ఈ పరిణామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
ఇప్పటికే శివసేనలో చీలిక తర్వాత మహారాష్ట్ర రాజకీయాల్లో షిండే, ఉద్ధవ్ వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఈ తాజా పరిణామంతో పార్లమెంట్లో షిండే వర్గం మరింత బలపడగా, ఉద్ధవ్ థాకరే రాజకీయంగా మరోసారి ఒత్తిడిని ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడింది. ఈ అంశంపై ఉద్ధవ్ వర్గం తదుపరి ఎలాంటి రాజకీయ లేదా న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..