Kolkata: లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి.. హత్య.. మృతదేహంపై తీవ్ర గాయాలు

|

Aug 10, 2024 | 7:37 PM

కోల్‌కతా హాస్పిటల్‌లో లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి చంపేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని , మహిళలకు రక్షణ లేకుండా పోయిందని భారీ ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. ఈ ఘటనపై అవసరమైతే సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తామన్నారు సీఎం మమతా బెనర్జీ.

Kolkata: లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి.. హత్య.. మృతదేహంపై తీవ్ర గాయాలు
The Accused
Follow us on

కోల్‌కతా మెడికల్‌ కాలేజ్‌లో లేడీ డాక్టర్‌పై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై నిరసనలు మరింత ఉధృతమయ్యాయి. లైంగికదాడి తరువాత డాక్టర్‌ను దారుణంగా హత్య చేశారని నాలుగు పేజీల పోస్ట్‌మార్టమ్‌ నివేదికలో వెల్లడయ్యింది. ఆమె మృతదేహంపై తీవ్ర గాయాలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. కాలేజీ పరిసర ప్రాంతాల్లోని సీసీ ఫుటేజ్ పరిశీలించామన్నారు.

ఆర్‌జి ఖర్‌ మెడికల్‌ కాలేజ్‌ సెమినార్‌ హాల్లో 31 ఏళ్ల డాక్టర్‌ మృతదేహం లభించింది. ఈ కేసులో ఒకరిని అరెస్ట్‌ చేసినట్టు కోల్‌కతా పోలీసులు తెలిపారు. డాక్టర్‌ను అతడు దారుణంగా రేప్‌ చేసి హత్య చేసినట్టు గట్టి సాక్ష్యాలు కూడా లభించినట్టు వెల్లడించారు. మెడికల్‌ కాలేజ్‌కు సంబంధం లేని ఆ వ్యక్తి తరచుగా హాస్టల్‌కు వచ్చేవాడని తెలిపారు. డాక్టర్‌ హత్యపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరుగుతోందన్నారు బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ . అవసరమైతే కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తామన్నారు.

“ఆ వ్యక్తి అక్కడికి ఎందుకు వచ్చాడో తెలియదు. కేసు దర్యాప్తు చురుగ్గా జరుగుతోంది. కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాం.. వాళ్ల సమక్షం లోనే దర్యాప్తు చేస్తున్నాం.. డాక్టర్లు , మెడికల్‌ విద్యార్ధుల ముందే అన్ని వివరాలు సేకరించాం.. వాళ్లకు అనుమానం ఉన్న వ్యక్తులపై ఆరా తీస్తున్నాం.. వాళ్లు అడిగిన సమాచారం వెంటనే అందిస్తున్నాం.. అతడు క్రిమినల్‌ .. నేరచరిత్ర ఉన్న విషయాన్ని గుర్తించాం” అని కోల్‌కతా పోలీసు కమిషనర్‌ వినీత్‌కుమార్‌ గోయెల్‌ తెలిపారు.

లేడీ డాక్టర్‌ హత్యపై బెంగాల్‌ లోని మెడికల్‌ కాలేజ్‌ విద్యార్ధులు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు దిగారు. నిందితుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. డాక్టర్లకు రక్షణ కరువయ్యిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ , కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా కోల్‌కతాలో భారీ ఆందోళన చేపట్టారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదని ఈ ఘటన నిరూపించిందని విపక్ష నేతలు ఆరోపించారు.

సంఘటనా స్థలాన్ని పరిశీలించేందుకు వస్తున్న కేంద్రమంత్రి సుకాంత మజుందార్‌ కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకున్నారు. సందేశ్‌ఖలి లాంటి ఘటనలు రాష్ట్రంలో తరచుగా జరుగుతున్నాయన్నారు సుకాంత మజుందార్‌.  అలాగే ఈ కేసుకు సంబంధించి ఇద్దరు వైద్యులను సైతం అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ట్రైనీ వైద్యురాలి మృతి కేసును ఛేదించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.