
మామూలుగా చిన్నపిల్లల్ని ఎప్పుడూ ఓ కంట కనిపెడుతూ ఉండాలి. వారు ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. ఉన్నచోట ఉండరు. తల్లిదండ్రులు ఆదమరిచి పిల్లల పట్ల నిర్లక్ష్యం వహిస్తే పరిణామాలు ఊహించని విధంగా ఉంటాయి అనడానికి ఈ ఘటనే ఉదాహారణ. ఫిబ్రవరి7, శుక్రవారం మధ్యాహ్నం 1:45 గంటలకు కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్ పక్కన ఉన్న చెత్త గుంతలో పడి 3 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. రాజస్థాన్కు చెందిన సౌరభ్ తన కుటుంబ సభ్యలతో కలిసి కొచ్చిన్ ఎయిర్పోర్టుకు వచ్చారు. ఈ క్రమంలోనే కుటుంబ సమేతంగా టెర్మినల్ సమీపంలోని ఓ రెస్టారెంట్కు భోజనం చేయడానికి వెళ్లారు. కుటుంబ సభ్యులందరూ భోజనం చేస్తున్న క్రమంలోనే ఈ దురదృష్టకర సంఘటన చోటు చేసుకుంది.
తల్లిదండ్రులు, మిగతా కుటుంబ సభ్యులు అందరూ ఆహారం తింటుండగా.. ఆ చిన్నారి రిధాన్ జాజు రెస్టారెంట్ వెనుక వైపునకు వెళ్లిపోయాడు. ఇంతలో అక్కడే ఉన్న ఓ చెత్తకుండీలో ప్రమాదవశాత్తూ పడిపోయాడు. కాసేపటికి చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు మొదట చుట్టుపక్కల అంతా వెతికారు. ఎంతకీ చిన్నారి జాడ లేకపోవడంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు కూడా చిన్నారి కోసం వెతకడం ప్రారంభించారు. అనంతరం సీసీటీవీ ఆధారంగా చిన్నారి చెత్తకుండీలో పడిపోయినట్లు గుర్తించారు. తమ చిన్నారి మృతి పట్ల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. దీంతో ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ అధికారులు తక్షణమే తదుపరి చర్యలు తీసుకున్నారు. ప్రమాదకరంగా ఉన్న చెత్త గుంతను మూసివేయించారు. అయితే, ఈ విషాదానికి దారితీసిన భద్రతా లోపంపై కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (CIAL) ఇంకా స్పందించలేదు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..