
ఓ వైపు కర్ణాటక రాష్ట్రంలో మంకీ ఫీవర్ విజృంభిస్తోన్న వేళ.. కొప్పళ జిల్లాలో వైరస్ ఫీవర్ వ్యాపిస్తూ ఆందోళన రేకెత్తిస్తోంది. జిల్లాలోని కుష్టగి తాలూకా నేరేబెంచి గ్రామంలో వైరల్ ఫీవర్ విస్తృతంగా వ్యాపించింది. గ్రామంలో చాలా మంది జ్వరాలు, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతున్నారు. విషయం తెలిసిన వెంటనే కుష్టగి తహసీల్దార్ రవికుమార్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు. పరిస్థితులను పరిశీలించారు. తక్షణమే స్పందించిన వైద్యారోగ్యశాఖ సిబ్బంది బాధితులకు వైద్య సహాయం అందిస్తోంది. గ్రామంలోని దేవాలయాన్నే చికిత్స కోసం ఆస్పత్రిగా మార్చారు.. రోగులకు వైద్యం చేస్తున్నారు. ఈ విషయం టీవీ 9 దృష్టికి చేరుకోవడంతో .. రోగులందరినీ తాలూకా ఆసుపత్రికి తరలిస్తామని తహసీల్దార్ తెలిపారు.
ఈ విషయమై టీవీ9తో మాట్లాడిన కొప్పల్ జిల్లా ఇన్చార్జి మంత్రి శివరాజ్ తంగడి, కుష్టగి తాలూకాలోని నేరేబెంచి గ్రామాన్ని సందర్శించాల్సిందిగా జిల్లా కలెక్టర్ను, జిల్లా ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించినట్లు తెలిపారు. ఆలయంలో రోగులకు వైద్యం అందించి తర్వాత మెరుగైన చికిత్స కోసం తాలూకా ఆసుపత్రిలో చేర్పిస్తామని తెలిపారు.
గ్రామస్థులు దీర్ఘకాలంగా జ్వరంతో పాటు శరీరం తీవ్ర నొప్పులతో బాధపడుతున్నారు. దీంతో వైరల్ ఫీవర్ తో బాధపడుతున్న వారిని కుష్టగి తాలూకా ఆసుపత్రికి తరలించారు. గత మూడు రోజులుగా వైద్యారోగ్య శాఖ సిబ్బంది గ్రామంలోని ఆలయంలో రోగికి చికిత్స అందిస్తున్నారు. టీవీ9 సమాచారం మేరకు గ్రామానికి చేరుకున్న అధికారులు రోగులను ఖాళీ చేయించి తాలూకా ఆస్పత్రికి తరలించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..