
కర్నాటక అసెంబ్లీలో ఆ రాష్ట్ర సీఎం సిద్ధ రామయ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.4,08,647 కోట్ల బడ్జెట్ను సభ ముందు పెట్టారు. మౌలిక సదుపాయాలు, మతపరమైన కేటాయింపులు, సినిమా ప్రమోషన్స్, మహిళా సాధికారికత వంటి అంశాల గురించి ఈసారి బడ్జెట్లో పెద్ద పీట వేశారు. సినిమా రంగానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నట్లు సిద్ధ రామయ్య వివరించారు.
సినీ రంగాన్ని ప్రోత్సహించాలని నిర్ణయించినట్లు సీఎం సిద్ధరామయ్య చెప్పారు. మల్టీప్లెక్స్లు సహా అన్ని థియేటర్లకు ఒకటే రేటు ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సినిమా టికెట్ ధర రూ.200గా నిర్ణయించామని అన్నారు. మల్టీప్లెక్స్లతో సహా రాష్ట్రంలోని అన్ని థియేటర్లలో అన్ని షోలకు ఇదే రేటు ఉంటుందని ఆయన తెలిపారు. సామాన్యులకు కూడా సినిమాను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
మైసూర్లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిల్మ్ సిటీ నిర్మాణానికి 150 ఎకరాలు కేటాయిస్తున్నట్లు సీఎం సిద్ధ రామయ్య చెప్పారు. ఫిల్మ్సిటీ నిర్మాణానికి రూ.500 కోట్లు కేటాయింపులు చేశామని అన్నారు. కన్నడ సినిమాలను ప్రమోట్ చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఓటీటీ ప్లాట్ఫామ్ను సైతం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సిద్ధ రామయ్య ప్రకటించారు.