
ప్రజారోగ్య ప్రయోజనాల దృష్ట్యా, కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గుట్కా, పాన్ మసాలాతో సహా పొగాకు, నికోటిన్ కలిగిన ఉత్పత్తులను రాష్ట్రవ్యాప్తంగా ఒక సంవత్సరం పాటు నిషేధించింది. ప్రభుత్వ ఆరోగ్య – కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఆహార భద్రత, ఔషధ పరిపాలన విభాగం, ఈ మేరకు 2026 ఆగస్టు 10న ఒక ప్రభుత్వ నోటిఫికేషన్ను జారీ చేసింది. నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరం పాటు కర్ణాటక అంతటా అమల్లో ఉండే ఈ నిషేధం, పొగాకు, నికోటిన్ కలిగిన గుట్కా, పాన్ మసాలా, ఇతర నిషేధిత ఉత్పత్తుల తయారీ, నిల్వ, రవాణా, పంపిణీ, అమ్మకాలకు ఇది వర్తిస్తుంది.
కర్ణాటక ప్రభుత్వం ఆహార భద్రతా అధికారుల నేతృత్వంలో ప్రత్యేక తనిఖీ, అమలు కార్యక్రమాలను కూడా ప్రారంభించింది. అధికారుల బృందాలు నిషేధిత పొగాకు, నికోటిన్ ఉత్పత్తుల అమ్మకం, పంపిణీని పర్యవేక్షిస్తాయి. ఉల్లంఘనలకు పాల్పడితే కఠినచర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఆహార భద్రత, ప్రమాణాల చట్టం, 2006లోని సెక్షన్ 30(2)(ఎ), ఆహార భద్రత, ప్రమాణాల (అమ్మకాలపై నిషేధం, పరిమితులు) నిబంధనలు, 2011లోని రెగ్యులేషన్ 2.3.4 కింద తమకున్న అధికారాలను ఉపయోగించి ఈ శాఖ ఈ ఉత్తర్వును జారీ చేసింది.
ప్రజలకు కర్ణాటక ప్రభుత్వం విజ్ఞప్తి
నిషేధిత పొగాకు లేదా నికోటిన్ ఉత్పత్తుల తయారీ, అమ్మకం లేదా పంపిణీకి సంబంధించిన ఏ సమాచారం లభించినా సంబంధిత అధికారులకు తెలియజేయాలని కర్ణాటక ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. రాష్ట్రంలో పొగాకు వ్యసనాన్ని అరికట్టడం, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత కర్ణాటకను నిర్మించడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ నిర్ణయాన్ని మాదకద్రవ్య రహిత, ఆరోగ్యకరమైన కర్ణాటక దిశగా ఒక అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..