కైలాస్-మానస్ సరోవర్ యాత్రికులకు కేంద్రం కీలక హెచ్చరిక.. ఆ పత్రాలు లేకుంటే వెళ్లొద్దు!

ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయ పౌరుల కోసం కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ముఖ్యమైన హెచ్చరికను జారీ చేసింది. ప్రయాణానికి సంబంధించిన అన్ని పత్రాలు లేకుండా టూర్ ప్లాన్ చేసుకోవద్దని కేంద్రం స్పష్టం చేసింది.

కైలాస్-మానస్ సరోవర్ యాత్రికులకు కేంద్రం కీలక హెచ్చరిక.. ఆ పత్రాలు లేకుంటే వెళ్లొద్దు!
Kailash Mansarovar Yatra 2026

Edited By:

Updated on: Jun 28, 2026 | 8:09 PM

ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల ద్వారా కైలాస్-మానస్ సరోవర్ యాత్రకు వెళ్లే భారతీయ పౌరులకు కేంద్ర విదేశాంగ శాఖ కీలక సూచనలు చేసింది. ప్రైవేట్ టూర్ ఆపరేటర్ల మాటలు నమ్మి, చైనాకు వెళ్లడానికి అవసరమైన ఎంట్రీ పర్మిట్లు, వీసాలు లేకుండా యాత్రకు వెళ్లిన కొందరు భారతీయ పౌరులు ప్రస్తుతం నేపాల్‌లో చిక్కుకుపోయారు. తమను రక్షించాలంటూ వారు విదేశాంగ శాఖను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే భారతీయ పర్యాటకులు ఎవరూ ఉబ్బందులు ఎదుర్కోవద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం తాజాగా ఈ అడ్వైజరీని విడుదల చేసింది.

విదేశాంగ శాఖ జారీ చేసిన ముఖ్యమైన సూచనలు

డాక్యుమెంట్లు తప్పనిసరి: చైనా వీసా, టిబెట్ అటానమస్ రీజియన్ (TAR) ఎంట్రీ పర్మిట్ వంటి అన్ని రకాల అవసరమైన ప్రయాణ పత్రాలు చేతికి వచ్చేంత వరకు పౌరులెవరూ భారతదేశం నుండి ప్రయాణాన్ని ప్రారంభించవద్దని విదేశాంగ శాఖ తెలిపింది.

ముందే ప్లాన్ వద్దు: సరైన పత్రాలు లేకుండా లేదా ప్రయాణ మధ్యలో డాక్యుమెంట్లు వస్తాయనే అంచనాతో యాత్రను ప్రారంభించడం వల్ల మధ్యలోనే చిక్కుకుపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

ఆపరేటర్ల గుర్తింపు: యాత్రికులు తాము ఎంచుకునే ప్రైవేట్ టూర్ ఆపరేటర్ సక్రమంగా రిజిస్టర్ అయ్యి, ప్రభుత్వం చేత గుర్తించబడ్డారా లేదా అనేది ముందే పూర్తిగా ధృవీకరించుకోవాలని స్పష్టం చేసింది

యాత్రికులు తీసుకోవలసిన జాగ్రత్తలు

కైలాస్-మానస్ సరోవర్ అనేది అత్యంత పవిత్రమైనదే కాక, చాలా కఠినమైన యాత్ర. కాబట్టి ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ, అధికారిక మార్గాల ద్వారానే ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాలని విదేశాంఖ శాఖ సూచించింది. ఈ యాత్ర సముద్ర మట్టానికి దాదాపు 19,500 అడుగుల ఎత్తులో, కఠినమైన వాతావరణంలో సాగుతుంది. కాబట్టి ప్రయాణానికి ముందే సమగ్ర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని సూచించింది.

ఎత్తైన ప్రాంతాలలో వచ్చే అనారోగ్యం, ఎమర్జెన్సీ మెడికల్ ఇవాక్యూయేషన్ కవర్ అయ్యేలా ట్రావెల్ ఇన్సూరెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. ప్రయాణ మార్గంలో వాతావరణ సూచనలను నిరంతరం గమనిస్తూ ఉండాలని. అత్యవసర పరిస్థితుల కోసం అంతర్జాతీయ రోమింగ్ ఉన్న సిమ్ కార్డ్, తగినంత నగదును దగ్గర ఉంచుకోవాలని సూచించారు.

నేపాల్‌లో చిక్కుకుపోయిన 52 మంది యాత్రికులు

చైనా వీసాలు, పర్మిట్లు లేకుండా ప్రైవేట్ ఆపరేటర్ల మాటలు నమ్మి వెళ్లిన దాదాపు 52 మంది భారతీయ యాత్రికులు ప్రస్తుతం నేపాల్ (ఖాట్మండు)లో చిక్కుకుపోయారు. తమకు సహాయం చేయాలంటూ ఆ బాధితులు అభ్యర్థించడంతో, ఎన్సీపీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ, ఎంబసీల దృష్టికి తీసుకెళ్లారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి, భవిష్యత్తులో ఇతర యాత్రికులు ఇలాంటి ఇబ్బందులు పడకుండా ఈ హెచ్చరికలను జారీ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us