Crime News: భోజనం విషయంలో గొడవ పడ్డారని దారుణం.. దంపతులను గొడ్డలితో నరికి చంపిన వంట మనిషి..

|

Sep 08, 2022 | 9:05 AM

ఓ వంట మనిషి తాను పనిచేస్తున్న ఇంటి యజమానులను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. రాత్రివేళ భోజనం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

Crime News: భోజనం విషయంలో గొడవ పడ్డారని దారుణం.. దంపతులను గొడ్డలితో నరికి చంపిన వంట మనిషి..
Murder
Follow us on

Jharkhand: జార్ఖండ్‌లోని గుమ్లా జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసకుంది. ఓ వంట మనిషి తాను పనిచేస్తున్న ఇంటి యజమానులను గొడ్డలితో నరికి దారుణంగా హత్యచేశాడు. రాత్రివేళ భోజనం విషయంలో తలెత్తిన గొడవ కారణంగా ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. దంపతులను నరికిన నిందితుడు.. పిల్లలపైనా దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్ర గాయాలు కాగా, బాలుడు తప్పించుకున్నాడు. కుమారుడి కేకలు విన్న స్థానికులు.. అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకున్నారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటన రైడిహ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మజ్‌గావ్ జామ్‌తోలి గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది.

రైడిహ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు సత్యేంద్ర లక్రా గత కొంతకాలం నుంచి రిచర్డ్‌, మెలెనీ మింజ్‌ దంపతుల ఇంట్లో వంట మనిషిగా పనిచేస్తున్నాడు. అయితే, భోజనం విషయంలో రిచర్డ్‌కు, వంట మనిషికి మధ్య కొన్నిరోజుల క్రితం గొడవ జరిగింది. ఈ క్రమంలో సత్యేంద్రను రిచర్డ్‌ హెచ్చరించాడు. దీంతో కోపం పెంచుకున్న సత్యేంద్ర ఆ కుటుంబం మొత్తాన్ని చంపాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి పడుకున్న తర్వాత గొడ్డలితో రిచర్డ్‌ దంపతులను హతమార్చాడు.

అనంతరం వారి పిల్లలపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో బాలికకు తీవ్ర గాయాలు కాగా బాలుడు అక్కడి నుంచి తప్పించుకొని స్థానికులకు చెప్పాడు. దీంతో వారు అప్రమత్తమై సత్యేంద్రను వారు పట్టుకున్నారు. తీవ్ర గాయాలపాలైన బాలిక తెరెసా ప్రస్తుతం రాంచీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని పోలీసులు తెలిపారు. రిచర్డ్ తన కుటుంబాన్ని చంపుతానని బెదిరించడంతో.. భయంతో ఈ ఘటనకు పాల్పడ్డానని సత్యేంద్ర పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..