
జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గువహతి మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (GMCH) 2025లో జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులలో ఆందోళనకరమైన పెరుగుదలను నివేదించింది. GMCH ప్రిన్సిపాల్, చీఫ్ సూపరింటెండెంట్ డాక్టర్ అచ్యుత్ చంద్ర బైశ్యా ప్రకారం.. ఈ సంవత్సరం ఇప్పటివరకు 44 యాక్టివ్ కేసులు ఉండగా, పది మంది మరణించారు. గత నెలలతో పోలిస్తే జూన్ నెలలో జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు గణనీయంగా పెరిగాయని డాక్టర్ బైశ్యా వెల్లడించారు. ఈ పెరుగుదల ఆరోగ్య అధికారులలో ఆందోళనలను రేకెత్తించింది.
ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం.. 2015, 2024 మధ్య అస్సాం రాష్ట్రం జపనీస్ ఎన్సెఫాలిటిస్ కారణంగా 840 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
నవంబర్ 2024లో పశ్చిమ ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో 72 ఏళ్ల వృద్ధుడికి డయాబెటిస్, ముందుగా ఉన్న గుండె జబ్బులు ఉన్న జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసు నమోదైంది. నవంబర్ 6న IgM ELISA ద్వారా అతనికి పాజిటివ్ వచ్చింది. చికిత్స తర్వాత నవంబర్ 15న డిశ్చార్జ్ అయ్యారు. స్థానికంగా ఎటువంటి వ్యాప్తి లేదని ఆరోగ్య అధికారులు నిర్ధారించారు. ఢిల్లీలో చాలా జపనీస్ ఎన్సెఫాలిటిస్ కేసులు సాధారణంగా సమీప రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్నాయి.
జపనీస్ ఎన్సెఫాలిటిస్ అనేది వైరస్ ద్వారా సంక్రమించే వ్యాధి, ఇది సోకిన క్యూలెక్స్ దోమల కాటు ద్వారా వ్యాపిస్తుంది. ఈ వైరస్ ప్రధానంగా నీటి పక్షులు, పందుల మధ్య వ్యాప్తి చెందుతుంది. ఈ మధ్యలోనే మనుషులకు కూడా సోకుతుంది. ఇది తీవ్రమైన జ్వరసంబంధమైన, నాడీ సంబంధిత అనారోగ్యానికి దారితీసినప్పటికీ జపనీస్ ఎన్సెఫాలిటిస్ మనుషులకు వ్యాపించదు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి