
మనిషి ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వేగంగా చేరుకోవడానికి ఎడ్ల బండ్ల నుంచి మొదలుకుని విమానాల ప్రయాణం వరకూ అభివృద్ధి చెందుతూ వచ్చాడు. ఆ తర్వాత అంతరిక్షంలో కూడా వెళ్లడం, చంద్రునిపై కాలు మోపడం లాంటి ఎన్నో అద్భుతాలు జరిగాయి. అయితే సామాన్యులు కూడా అంతరిక్షంలోకి వెళ్లేందుకు వివిధ దేశాల్లో సన్నహాలు చేస్తున్నారు. ఇప్పుడు మనదేశంలో కూడా అంతరిక్షంలో ప్రయాణించాలనుకునే వారికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో శుభవార్త తెలిపింది. 2030 నాటికి అంతరిక్ష ప్రయాణానాన్ని అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించింది. అయితే ఈ స్పేస్ టూర్ ఆర్బిటల్ గా ఉంటుందా లేదా సబ్ ఆర్బిటాల్ గా ఉంటుందా అనే దానిపై స్పష్టత లేదు. కాని టికెట్ ధర మాత్రం రూ.6 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆర్బిటల్ స్పేస్ క్రాఫ్ట్ అనేది కక్ష్య వేగం తో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ రాకెట్ దాని కంటే తక్కువ వేగంతో ప్రయాణిస్తుంది. సబ్ ఆర్బిటల్ ట్రిప్ అయితే స్పేస్ క్రాఫ్ట్లో తిరిగి భూమ్మీదకు వచ్చేప్పుడు అంతరిక్షం అంచుల్లో కొద్ది నిమిషాలు తక్కువ గ్రావిటీ వాతావరణంలో ఉన్న అనుభవాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఇటీవల బ్లూ ఆరిజిన్ కంపెనీ సబ్ ఆర్బిటల్ రాకెట్ టూర్ను విజయవంతంగా చేపట్టింది. 2021లో బ్లూ ఆరిజిన్ అధినేత జెఫ్ బెజోస్ మరో ముగ్గురితో కలిసి అంతరిక్షంలో పర్యటించి వచ్చారు. సబ్ ఆర్బిటల్ రాకెట్లు ఆర్థికంగా అందుబాటులో ఉండటంతోపాటు వాటిని రెండోసారి కూడా వినియోగించే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అంతరిక్ష పర్యటనకు ఎంతో క్రేజ్ ఉంది.అందుకే అంతర్జాతీయంగా వర్జిన్ గెలాక్టిక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్, ఆరిజిన్ స్పాన్, బోయింగ్, స్పేస్ అడ్వెంచర్స్, జీరో టు ఇన్ఫినిటీ వంటి ప్రైవేట్ స్పేస్ టూరిజం కంపెనీలు వాణిజ్యపరంగా స్పేస్ ఫ్లైట్స్ను నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..