పౌరసత్వ సవరణ చట్టంపై ఆందోళనలు ఇంకా కొనసాగుతోన్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు, అసోం, వెస్ట్ బెంగాల్లో తీవ్ర స్థాయిలో నిరసనలు మిన్నంటుతున్నాయి. ఈ క్రమంలో వెస్ట్ బెంగాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఆందోళనకారులు ఇప్పటికే పలు రైళ్లను, బస్సులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు ట్రోల్ అవుతుండటంతో.. శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.
ఈ మేరకు వెస్ట్ బెంగాల్లోని ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలను తాత్కాలికంగా నిలిపివేశారు. మాల్దా, ముర్షీదాబాద్, హౌవ్డా, నార్త్ 24 పరగణా, సౌత్ 24 పరగణా జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు బంద్ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే ఎప్పటి వరకు ఈ నిషేధం ఉంటుందన్నదానిపై స్పష్టత లేదు. కాగా, ముర్షీదాబాద్లో ఆందోళనకారులు ఐదు ఖాళీ రైళ్లకు నిప్పు పెట్టారు. కాగా, అసోంలోని 10 జిల్లాల్లో కూడా ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. అంతేకాదు పలు చోట్ల ఇంకా కర్ఫ్యూ నీడలు కొనసాగుతున్నాయి.