Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?

ఈ నెల ప్రారంభంలో విదర్భలో వేడి తరంగ పరిస్థితులు నమోదైనప్పటికీ, బుధవారం నాటికి దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో మొదటిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించింది. వాతావరణ మార్పుల వల్ల శీతాకాలం - వేసవి మధ్య వ్యవధి యేటా కుంచించుకుపోతున్నట్లు, దీని పర్యావసానమే వేసవి త్వరగా ఆగమిస్తున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..

Heatwave Alert: అయ్‌ బాబోయ్‌ మార్చిలోనే మాడు పగిలే ఎండలు..! వసంతకాలం కనుమరుగవుతోందా?
Heatwave Alert Across India From March

Updated on: Mar 12, 2026 | 10:46 AM

న్యూఢిల్లీ, మార్చి 12: ఈ ఏడాది కాస్త ముందుగానే వేసవి పలకరించింది. మార్చి నెల ఆరంభం నుంచే బాణుడు ప్రతాపం చూపుతున్నాడు. తొలిసారి బుధవారం (మార్చి 11) దేశ వ్యాప్తంగా పలు చోట్ల వడగాల్పులు వీశాయి. ముఖ్యంగా ఉత్తర భారతంలోని గుజరాత్‌లోని సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు చేసుకున్నాయి. సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాలలో చాలా చోట్ల, గుజరాత్‌లో కొన్ని చోట్ల వేడి గాల్పులు నెలకొన్నాయి. అటు విదర్భలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. ఈ నెల ప్రారంభంలో విదర్భలో వేడి తరంగ పరిస్థితులు నమోదైనప్పటికీ, బుధవారం నాటికి దేశంలోని పశ్చిమ ప్రాంతాలలో మొదటిసారి అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు గుర్తించింది. వాతావరణ మార్పుల వల్ల శీతాకాలం – వేసవి మధ్య వ్యవధి యేటా కుంచించుకుపోతున్నట్లు, దీని పర్యావసానమే వేసవి త్వరగా ఆగమిస్తున్నట్లు నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రాజస్థాన్ మీదుగా వీచే యాంటీ సైక్లోన్ వేడి గాలులను గుజరాత్ వైపుకు తీసుకువెళుతోంది. దీని వలన ఈ ప్రాంతంపై గాలి తగ్గిపోతుందని స్కైమెట్ వెదర్‌లో క్లైమాట్‌ అండ్‌ మెటీరియాలజీ వైస్‌ ప్రెసిడెంట్‌ మహేష్ పలావత్ అన్నారు. ఇది యేటా పునరావృతమవుతున్నట్లు ఆయన తెలిపారు. మరోషాకింగ్‌ విషయం ఏమంటే.. వసంత కాలం కనుమరుగవుతుంది. శీతాకాలం నుంచి వేసవికి మార్పు చాలా త్వరగా జరుగుతున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలి సంవత్సరాల్లో ఈ ధోరణి అధికంగా కనిపిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం గుజరాత్, పశ్చిమ రాజస్థాన్, విదర్భ ప్రాంతాలలో చాలా చోట్ల, మధ్యప్రదేశ్, మరాఠ్వాడ ప్రాంతాలలో కొన్ని చోట్ల, ఛత్తీస్‌గఢ్, ఒడిశా ప్రాంతాలలో కొన్ని చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 38 నుంచి 42 డిగ్రీల సెంటిగ్రేట్‌ పరిధిలో ఉన్నాయి. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రతలు 35 నుంచి 38°సెంటిగ్రేట్‌ మధ్య ఉన్నాయి. హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్, తూర్పు రాజస్థాన్‌, పంజాబ్, గుజరాత్, సౌరాష్ట్ర, కచ్‌లలో చాలా చోట్ల పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5.1 డిగ్రీలకుపైగా ఉన్నాయి. ఉప-హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో చాలా చోట్ల, మధ్య మహారాష్ట్ర, తీర కర్ణాటకలో కొన్ని చోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3.1 నుంచి 5.0 డిగ్రీల సెంటిగ్రేట్‌ వరకు గణనీయంగా ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మార్చిలో ఇటువంటి వేడిగాలులు సాధారణమేనని, దీనిని ముందుగానే అంచనా వేశామని IMD డైరెక్టర్ జనరల్ ఎం మోహపాత్ర అన్నారు.

ఇవి కూడా చదవండి

మార్చి 13 వరకు గుజరాత్‌లో వేడిగాలులు, తీవ్రమైన వేడిగాలులు కొనసాగే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌లో మార్చి 12 నుంచి14 తేదీలలో, అస్సాం, మేఘాలయలో మార్చి 13 నుంచి 15 తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక మైదాన ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరినప్పుడు, పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 4.5 డిగ్రీలు అధికంగా ఉంటే వడగాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వేసవి త్వరగా ప్రారంభం కావడం వల్ల దేశ వ్యాప్తంగా విద్యుత్ మౌలిక సదుపాయాలపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ ఏడాది 2024 కంటే తీవ్రంగా ఎండలు ఉండే అవకాశం ఉంది. కేవలం భారత్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకావం ఉందని, దీంతో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భారత్‌ చమురు, గ్యాస్ అవసరాలలో 85 శాతం విదేశీ సరఫరాదారులపై ఆధారపడి ఉంది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన దిగుమతులు దెబ్బతినడంతో ప్రస్తుత గ్యాస్ అవసరంలో 25 శాతం కోరత ఏర్పడినట్లు పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us