NDA vs INDIA Alliance: నితీశ్ బిహారీ రాజకీయాన్ని… ఇండియా కూటమి క్యాష్ చేసుకోగలదా..?

ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశంపై గట్టిగా డిమాండ్ చేసే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇన్నేళ్లుగా అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నతో పాటు, ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కుల గణనను ..

NDA vs INDIA Alliance: నితీశ్ బిహారీ రాజకీయాన్ని... ఇండియా కూటమి క్యాష్ చేసుకోగలదా..?
India Alliance Vs Bjp

Edited By: Ravi Kiran

Updated on: Oct 04, 2023 | 4:58 PM

ఇన్నాళ్లుగా మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు చేస్తూ మెజారిటీ హిందూ ఓటర్లను దూరం చేసుకున్న కాంగ్రెస్ సహా సెక్యులర్ పార్టీలు ఇప్పుడు ఆ హిందుత్వ ఓటుబ్యాంకును విచ్ఛిన్నం చేసేందుకు అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. కులాలవారిగా హిందూ సమాజాన్ని విభజించగల్గితే చాలు.. భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని దెబ్బకొట్టొచ్చని భావిస్తున్నాయి. తాజాగా బిహార్ రాష్ట్రంలో విడుదల చేసిన కులాలవారీ జనాభా గణాంకాలే ఈ క్రమంలో తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. నితీశ్ ప్రయోగించిన ఈ అస్త్రాన్ని కాంగ్రెస్ సహా I.N.D.I కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కలసికట్టుగా ప్రయోగిస్తే బ్రహ్మాస్త్రంగా మారి బీజేపీని దెబ్బతీసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. అయితే విపక్ష కూటమి దాన్ని బ్రహ్మాస్త్రంగా మార్చుతుందా లేక చతికిలపడుతుందా అన్నదే ఇక్కడ అసలు ప్రశ్న.

బిహార్ – కులమే ఆయుధం

కుల రాజకీయాలు దేశంలో అన్నిచోట్లా ఉన్న తంతే. బిహార్ విషయానికొస్తే అది మరింత ఎక్కువ. ఇక్కడ ప్రజలు అభ్యర్థికో, పార్టీకో ఓటు వేయరు. కులానికి ఓటు వేస్తారు. ఆ స్థాయిలో అక్కడ కులం ప్రభావం చూపుతుంది. జేడీ(యూ), ఆర్జేడీ, కాంగ్రెస్ కలిసి మహాకూటమిగా ఏర్పడి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సందర్భంలో నా స్వానుభవం. నేను, మా కెమేరామన్ రమేశ్ కలిసి ఎన్నికల కవరేజికి ఆ రాష్ట్రానికి వెళ్లాం. స్థానికంగా ఓ ట్యాక్సీ మాట్లాడుకుని అనేక ప్రాంతాలు పర్యటించాం. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల సమయంలో మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాలు చూస్తుంటాం. కానీ ఇక్కడ అభ్యర్థులకు వాటితో పెద్దగా పని లేదు. గ్రామాల్లో కులపెద్దలను ప్రసన్నం చేసుకుంటే చాలు, గంపగుత్తగా ఆ కులం ఓట్లలో ఒక్కటి కూడా తేడా రాకుండా దక్కుతాయని గ్రహించాను. మా ట్యాక్సీ డ్రైవర్ గతంలో లాలూ ప్రసాద్ యాదవ్, ఆమె సతీమణి రబ్రీ దేవి హయాంలో శాంతిభద్రతల క్షీణత గురించి, పాలనపరమైన లోటుపాట్ల గురించి విమర్శిస్తూ తన అభిప్రాయం చెప్పాడు. కానీ తన కులం కట్టుబాటును దాటి వ్యతిరేకంగా మాత్రం ఓటు వేయలేనని, మహాకూటమికే తన ఓటు అని చివర్లో ముక్తాయింపు ఇచ్చాడు. బిహార్ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో, ముఖ్యంగా హిందీ మాట్లాడే రాష్ట్రాల్లో ‘కులం’ ఎంత ప్రభావవంతమైన ఆయుధమో అన్నది దీన్ని బట్టే అర్థమైంది.

ఇవి కూడా చదవండి

వర్తమానంలోకి వస్తే.. గాంధీ జయంతి సందర్భంగా బిహార్ రాష్ట్ర కులగణన వివరాలను విడుదల చేస్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుల రాజకీయాలకు బూస్టర్ డోస్ ఇచ్చారు. కుల గణనను ప్రకటించిన మొదటి రాష్ట్రంగా బీహార్ అవతరించింది. బీహార్‌లో ఒక్కో కులానికి ఉన్న సంఖ్యా బలం ఇప్పుడు తెలిసిపోయింది. వారి రాజకీయ, సామాజిక, ఆర్థిక స్థితిగతులు సైతం తెలిశాయి. అందుబాటులోకి వచ్చిన గణాంకాల ఆధారంగా కులాల సంఖ్యాబలంపై తులనాత్మక విశ్లేషణ చేయవచ్చు. తద్వారా రాజకీయాల్లో వారిని పావులుగా మార్చుకోవచ్చు. తద్వారా కుల గణన అధికార బీజేపీ హిందుత్వ రాజకీయాలను దెబ్బతీసే అవకాశం ఉంది. అంతిమంగా ప్రస్తుత భారత రాజకీయాల మొత్తం సరళిని మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉంది.

అస్త్రంగా మలచాలంటే ఏం చేయాలి?

బీజేపీని ఓడించడమే లక్ష్యంగా విపక్షాలన్నింటినీ సమావేశపరిచి అజెండా తయారుచేయడంలో సఫలమైన బిహార్ సీఎం నితీశ్ కుమార్, కుల గణన చేపట్టి మరోసారి మిగతా పార్టీలకు దిశానిర్దేశం చేశారు. గత నెలలో విపక్ష కూటమి సమన్వయ కమిటీ సమావేశంలో జాతీయ స్థాయిలో కుల గణన చేపట్టాలన్న డిమాండ్‌కు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఆ తర్వాత జరిగిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజ్యసభలో చర్చ సందర్భంగా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్ డిమాండ్ చేస్తూ ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా చదివిన ‘ఠాకూర్ కా కువాన్’ కవిత అగ్రవర్ణ రాజ్‌పుత్‌లలో ఆగ్రహానికి దారితీసింది. ఇప్పుడు బీహార్‌లో కుల గణన ప్రకటనతో ఓబీసీ రాజకీయాలు ఊపందుకున్నాయి. ఆ ఊపును కొనసాగించాల్సిన బాధ్యత కాంగ్రెస్, దాని మిత్రపక్షాలపై ఉంది. అయితే రాహుల్ గాంధీ ట్రాక్ రికార్డ్ గమనిస్తే.. రాజకీయంగా ఉపయోగపడే అనేకాంశాలను ఆయన విడిచిపెట్టిన సందర్భాలున్నాయి. ఈసారి కూడా అలా చేసే అవకాశం లేకపోలేదని కొందరు ఆందోళన చెందుతున్నారు. అయితే ఈ మధ్య కులగణన కోసం గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. తాము అధికారంలోకి వస్తే కులగణన చేపడతామంటూ ప్రకటిస్తున్నారు. ‘జిస్కీ జిత్నీ అబాదీ ఉస్కా ఉత్నీ హిస్సేదారి’ అంటూ జనాభా దామాషా ప్రకారం అన్నివర్గాలకు రాజకీయాల్లో, రాజ్యాధికారంలో వాటా దక్కాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది ప్రజల్లోకి వెళ్తే కచ్చితంగా గేమ్ ఛేంజర్‌గా మారే అవకాశం ఉంది.

ఒకవేళ కాంగ్రెస్ ఈ అంశంపై గట్టిగా డిమాండ్ చేసే ముందు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ముందు అమలు చేయాల్సి ఉంటుంది. లేదంటే ఇన్నేళ్లుగా అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదు అన్న ప్రశ్నతో పాటు, ఇప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎందుకు చేయడం లేదన్న ప్రశ్నను ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే కర్నాటక, హిమాచల్ ప్రదేశ్‌లలో కుల గణనను కాంగ్రెస్ వెంటనే ప్రకటించాలి. అలాగే, అధికారంలోకి వస్తే రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో కూడా కులగణన చేపడతామని చెప్పాలి. ఈ నిర్ణయం అగ్రవర్ణాల ఓట్లను దూరం చేయవచ్చు. కానీ అంతకంటే ఎక్కువ సంఖ్యలో ఉన్న ఓబీసీ ఓట్ల ద్వారా భర్తీ చేయవచ్చు.

అధికారంలో ఉన్నప్పుడు కుల గణన నిర్వహించడంలో విఫలమైనందుకు ఇటీవల రాహుల్ గాంధీ చేసినట్లుగా కాంగ్రెస్ క్షమాపణలు చెప్పడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదు. ఈ విషయంలో కాంగ్రెస్ నిజాయితీగా పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయాలి. 2019లో ఆ పార్టీ దాదాపు 186 పార్లమెంటరీ స్థానాల్లో బీజేపీతో ప్రత్యక్షంగా తలపడింది. వాటిలో కేవలం 15 మాత్రమే గెలుచుకోగలిగింది. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ మరోసారి విఫలమైతే విపక్ష కూటమి సాధించేదేమీ ఉండదు.

మరోవైపు విపక్ష కూటమి ముఖ్యమంత్రులు కూడా నితీశ్ కుమార్ మార్గాన్ని అనుసరించాలి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ వంటి ముఖ్యమంత్రులు కుల జనాభా గణన విషయంలో ఇతర మిత్రులతో ఏకీభవించడం లేదు. కానీ ప్రకటించడం వల్ల వచ్చే నష్టం లేదు అన్నది మిగతా భాగస్వామ్యపక్షాల సూచన. ఈ పార్టీలు ఇప్పటికే జాతీయస్థాయిలో కుల గణనకు అంగీకరించినప్పుటు.. రాష్ట్ర స్థాయిలో ప్రకటిస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ఒక అడుగు ముందుకేస్తే విపక్ష కూటమి మొత్తంగా ఓబీసీలను ఆకట్టుకోవడంలో దోహదపడుతుంది.

మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసి తద్వారా మహిళా ఓట్లకు గాలం వేయాలని చూస్తున్న బీజేపీ.. ఆ బిల్లును తక్షణం అమల్లోకి తీసుకురాకపోవడం వల్ల కొంత విమర్శల్ని ఎదుర్కోక తప్పడం లేదు. ఈ పరిస్థితుల్లో విపక్ష కూటమి ఓబీసీ మహిళలకు టికెట్ల పంపిణీలో ప్రాధాన్యతనిస్తే… బీజేపీ మహిళా బిల్లు అస్త్రానికి చెక్ పెట్టొచ్చు. ఇప్పటికే ఉన్న ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు సీట్లతో పాటు ఓబీసీ మహిళలకు కనీసం 20 శాతం వాటా దక్కేలా చూడగలిగితే సరిపోతుంది. కూటమిలో పార్టీల స్వభావం, సిద్ధాంతం ఒకటి కానప్పటికీ.. 120 స్థానాలు కల్గిన ఉత్తర్ ప్రదేశ్, బిహార్ రాష్ట్రాల్లోని సమాజ్‌వాదీ, జనతాదళ్(యునైటెడ్), రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ)లు మహిళలకు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిస్తే బీజేపీని ఇరకాటంలో పడేయవచ్చు.

దీంతో పాటు విపక్ష కూటమి ఓబీసీల వెంట ఉందని చెప్పడం కోసం పాట్నాలోని ప్రసిద్ధ గాంధీ మైదాన్ లేదా లక్నోలోని హజ్రత్ మహల్ పార్క్‌లో ‘ఓబీసీ’ సభలు నిర్వహించాలి. దేశంలో ఎన్నడూ జరగనటువంటి అతిపెద్ద ర్యాలీగా చెప్పుకోవాలి. ఇంత పెద్ద దేశంలో ఓట్ల శాతానికి గండి కొట్టాలంటే ఇలాంటి భారీ ప్రయత్నాలు కూడా అవసరమవుతాయి. సోషల్ మీడియాలో ఎంత చేసినా సరే.. ఎన్నికల్లో గెలుపొందాలంటే క్షేత్రస్థాయిలో ఉన్న వ్యక్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. గతంలో లక్నో, పాట్నా, ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలు దేశంలో అనేక ఉద్యమాలకు నాంది పలికాయి. ఇలాంటి ఉద్యమాల్లో ఓబీసీలను నిమగ్నం చేయడం ద్వారా విపక్ష కూటమి ప్రయోజనం పొందగల్గుతుంది.

కమలదళం ముందున్న సవాళ్లు

కులగణన చేపట్టినంత మాత్రాన ఆయా కులాల్లో అకస్మాత్తుగా వచ్చే మార్పేమీ ఉండదు. కాకపోతే ఆయా కులాల సామాజిక, ఆర్థిక, విద్యా స్థితిగతులను మెరుగుపరిచేందుకు అవసరమైన ప్రణాళికలు, పథకాలు రూపొందించేందుకు ఈ డేటా ఉపయోగపడుతుంది. అదే ఇప్పుడు రాజకీయాల్లో ముడి సరుకుగా మారుతుంది. కులగణన అగ్రవర్ణాలకు, ఓబీసీలకు మధ్య అంతరాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. కుల గణన గణాంకాలు ఏయే కులాల పరిస్థితి అధ్వాన్నంగా ఉందో తెలియజేస్తాయి. సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కులాలేంటో తెలుస్తుంది. సంఖ్యాబలం ఉన్నప్పటికీ అణగారిన కులాలు, రాజకీయాల్లో తగిన ప్రాతనిథ్యం లేని కులాలు తమకు సముచిత వాటా కోసం, సంక్షేమం కోసం నినదించే అవకాశం ఉంటుంది. ఈ పరిణామాల నేపథ్యంలో తాము దేశవ్యాప్తంగా కులగణన చేపట్టి, ఆ ప్రాతిపదికన ఓబీసీ రిజర్వేషన్లు పెంచుతామని కాంగ్రెస్ లేదా విపక్ష కూటమి ప్రకటిస్తే.. బీజేపీ ఇరకాటంలో పడుతుంది. ఆ హామీని తిరస్కరించడం సాధ్యం కాదు. నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్‌వార్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ)కి చట్టబద్ధత, కులవృత్తులపై ఆధారపడ్డ బీసీ వర్గాల కోసం ముద్ర రుణాలు, పీఎం-విశ్వకర్మ వంటి పథకాలు, కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యలో ఓబీసీ మంత్రులు వంటి చర్యలెన్ని చేపట్టినా సరే.. కులగణనపై జాగ్రత్తగా వ్యవహరించకపోతే మోదీ సర్కారుకు వరుసగా రెండు పర్యాయాలు భారీ విజయాన్ని అందించిన ఓబీసీ ఓటుబ్యాంకులో చీలిక వచ్చే ప్రమాదం ఉంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..