Lok Sabha Results: బంపర్ మెజార్టీతో గెలిపొందిన జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు.. ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తారా..?

|

Jun 06, 2024 | 8:36 PM

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు బంపర్ మెజార్టీతో గెలిపొందారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను వెనక్కినెట్టి విజయకేతనం ఎగరవేశారు. పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిధుల కేసు నిందితుడు రషీద్‌ విజయం సాధించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ ఇద్దరు లోక్‌సభలో ప్రమాణం స్వీకారం చేయొచ్చా?

Lok Sabha Results: బంపర్ మెజార్టీతో గెలిపొందిన జైలు శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు.. ఎంపీ ప్రమాణ స్వీకారం చేస్తారా..?
Amritpal Singh And Engineer Rashid
Follow us on

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఉగ్ర ఖైదీలు బంపర్ మెజార్టీతో గెలిపొందారు. ప్రధాన పార్టీ అభ్యర్థులను వెనక్కినెట్టి విజయకేతనం ఎగరవేశారు. పంజాబ్‌లో వేర్పాటువాది అమృత్‌పాల్‌ సింగ్‌, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రనిధుల కేసు నిందితుడు రషీద్‌ విజయం సాధించారు. ప్రస్తుతం జైల్లో ఉన్న ఈ ఇద్దరు లోక్‌సభలో ప్రమాణం స్వీకారం చేయొచ్చా? నిబంధనలు ఏం చెబుతున్నాయి..? ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

జమ్మూ కశ్మీర్‌లోని బారాముల్లా నుంచి ఉగ్ర నిధుల కేసు నిందితుడు ఇంజినీర్‌ రషీద్‌ లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందాడు. జమ్ము కశ్మీర్​లో నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లాపై 2లక్షల 41వేల 42ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగరేశాడు. జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019 ఆగస్టులో రషీద్‌ను అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి జైలు జీవితంలో ఉన్నారు. అయితే తాజా ఎన్నికల్లో బారాముల్లా స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఏకంగా మాజీ సీఎంనే ఓడించి ఔరా అనిపించాడు.

ఇక పంజాబ్‌లోలోని ఖదూర్ సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి వేర్పాటువాది అమృతపాల్ సింగ్ బంపర్ మెజార్టీతో గెలుపొందారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైలులో ఉన్న ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. కాంగ్రెస్‌ అభ్యర్థి కుల్బీర్‌ సింగ్‌ జీరాపై లక్షా 97వేల 120ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అమృత్‌సర్‌ జిల్లా అజ్‌నాలా పోలీసులపై దాడి కేసులో ‘వారిస్‌ పంజాబ్‌ దే’ నాయకుడు, వేర్పాటువాది అమృత్‌పాల్‌ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. జాతీయ భద్రతా చట్టం కింద 2023 ఏప్రిల్‌లో పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అప్పటి నుంచి అస్సాంలోని దిబ్రూగఢ్‌ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పంజాబ్‌లోని ఖడూర్‌సాహిబ్‌ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచి రికార్డ్ సృష్టించారు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉండటంతో ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు అనుమతిస్తారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాలి. ప్రమాణం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు వెళ్లాల్సి ఉంటుందని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…