Rohingyas: అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలకు భారత పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదుః కేంద్రం
భారత్లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్లకు పౌరసత్వం ఇచ్చే ఉద్దేశ్యం లేదని కేంద్రం సుప్రీంకోర్టులో తేల్చిచెప్పింది. రోహింగ్యాలతో భారత అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు.

భారత్లో అక్రమంగా ఉంటున్న రోహింగ్యాలకు పౌరసత్వం ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. పౌరసత్వ సవరణ చట్టం కింద వాళ్లకు పౌరసత్వం ఇచ్చే ఉద్దేశ్యం లేదని కేంద్రం సుప్రీంకోర్టులో తేల్చిచెప్పింది. రోహింగ్యాలతో భారత అంతర్గత భద్రతకు ముప్పు పొంచి ఉందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు. శరణార్ధులందరికి భారత పౌరసత్వం ఇవ్వడం సాధ్యం కాదని వెల్లడించింది.
పార్లమెంట్ చేసిన చట్టంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదని అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆర్టికల్ 21 ప్రకారం విదేశీయులు స్వేచ్చగా తిరిగే అవకాశం ఉంటుందని, కాని భారత పౌరుల లాగా వాళ్లకు హక్కులు కల్పించడం సాధ్యం కాదని తెలిపింది. కేంద్రం UNHCR ఇచ్చిన కార్డులను గుర్తించడం లేదని కూడా సుప్రీంకోర్టుకు కేంద్రం తెలిపింది. రోహింగ్యాలు భారత్లో స్థిరపడడం రాజ్యాంగ విరుద్దమని వెల్లడించింది.
బంగ్లాదేశ్తో సహా సరిహద్దు దేశాల నుంచి శరణార్ధుల రాకతో దేశం అనేక సమస్యలు ఎదుర్కొంటుందని కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దేశంలో పలు చోట్ల రోహింగ్యాలు ఇప్పటికే ఫేక్ డాక్యుమెంట్లు , ఐడీ కార్డులతో స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నట్టు వివరించారు. అక్రమంగా భారత్లో చొరబడ్డ శరణార్ధులను డిటెన్షన్ క్యాంపుల నుంచి విడుదల చేసే ప్రసక్తే లేదని తెలిపింది. టిబెట్, శ్రీలంక శరణార్ధులతో రోహింగ్యాలను పోల్చలేమని సుప్రీంకోర్టుకు కేంద్రం విన్నవించింది. నిర్బంధంలో ఉన్న రోహింగ్యాలను విడుదల చేయాలనే పిటిషన్పై ప్రభుత్వం స్పందించింది. ప్రియాలి సూరి దాఖలు చేసిన పిటిషన్పై కేంద్రం సుప్రీంకోర్టులో అఫిడవిట్ను దాఖలు చేసింది. పార్లమెంట్ చేసిన చట్టాన్ని అతిక్రమించే రీతిలో ఈ పిటిషన్ ఉందని కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది.
విదేశీయుల చట్టం ప్రకారం దేశంలో అక్రమంగా నివసిస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని కేంద్రప్రభుత్వం చెబుతోంది. రోహింగ్యా ముస్లింల సమస్యపై దేశంలో చాలాసార్లు అలజడి చెలరేగింది. వీరిని దేశం నుంచి బహిష్కరించడాన్ని చాలా మంది సమర్థిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
