
ఢిల్లీలో బాంబు పేలుడు ఘటన మరవక ముందే దేశంలో ఐదు ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్, ఢిల్లీ , ముంబై , చెన్నై , త్రివేండ్రం ఎయిర్పోర్ట్లను పేల్చేస్తామని ఇండిగో కార్యాలయానికి బెదిరింపు ఈమెయిల్ వచ్చింది. దీంతో అన్ని ఎయిర్పోర్టుల్లో బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. దేశవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ, ముంబై, చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్.. ఐదు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో ఈమెయిల్ అందినట్లు పోలీసులు తెలిపారు. ఈ నగరాల్లో బాంబు బెదిరింపులు సంభవించే అవకాశం ఉందని ఈమెయిల్లో పేర్కొన్నారని.. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఈ విమానాశ్రయాలలో అవసరమైన భద్రతా ప్రోటోకాల్లను అమలు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి..
ఇప్పటికే.. ఢిల్లీ భారీ పేలుడు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో హై అలర్ట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో.. హైదరాబాద్లోనూ పోలీసులు అప్రమత్తం అయ్యారు. భారీ పేలుడుతోపాటు.. వివిధ ప్రాంతాల్లో పెద్దయెత్తున ఉగ్ర లింకులు బయటపడడంతో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. దీనిలో భాగంగానే.. హైదరాబాద్ నార్త్ జోన్ పరిధిలోని హోటల్స్, లాడ్జ్లపై పోలీసులు ఫోకస్ పెట్టారు. హోటల్స్, లాడ్జ్ల యజమానులతో నార్త్ జోన్ DCP రష్మీ పెరుమాళ్ సమావేశమయ్యారు. దాదాపు.. 100కు పైగా హోటల్స్, లాడ్జ్ల ఓనర్స్, మేనేజర్స్తో భేటీ అయి.. పలు కీలక సూచనలు చేశారు.
పబ్లిక్ సేఫ్టీ యాక్ట్, ట్రేడ్ లైసెన్స్, BNSS నిబంధనలు కచ్చితంగా పాటించాలన్నారు DCP రష్మీ పెరుమాళ్. విజిటర్ రిజిస్టర్ నిర్వహణ, గెస్ట్ ఐడీ ధృవీకరణ తప్పనిసరిగా ఫాలో కావాలని చెప్పారు. CCTV కెమెరాలు, సెక్యూరిటీ ఏర్పాట్లు ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. హోటల్స్, లాడ్జీలలో అనుమతి లేకుండా కార్యక్రమాలు, ఈవెంట్లు నిర్వహించినా.. అక్రమ కార్యకలాపాలు చేపట్టినా.. కఠిన చర్యలు తప్పవన్నారు. ప్రజా భద్రతకు విఘాతం కలిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేదిలేదని DCP రష్మీ పెరుమాళ్ హెచ్చరించారు.
ఢిల్లీ భారీ పేలుడు ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో.. ఉగ్ర కార్యకలాపాలపై కేంద్ర నిఘా వర్గాలు అలర్ట్ అయ్యాయి. దేశంలోని ఉగ్ర జాడలను బట్టబయలు చేస్తున్నాయి. అయితే.. దేశంలో ఎక్కడ ఉగ్ర అలజడి రేగినా.. దానికి లింకులు హైదరాబాద్తో కనెక్ట్ అవుతుంటాయి. ఈ క్రమంలోనే.. హైదరాబాద్లోని మూడు కమిషనరేట్ల పరిధిలోనూ హైఅలర్ట్ ప్రకటించారు. రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు పోలీసులు..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..