ఆ పోలింగ్ కేంద్రంలో రుచికరమైన వంటకాలను వడ్డించారు.. వంద శాతం పోలింగ్‌తో రికార్డు..

|

Nov 13, 2022 | 10:49 AM

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 66 శాతం పోలింగ్ నమోదైంది. 7881 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రమైన తాషిగ్యాంగ్‌లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. అక్కడి పోలింగ్ కేంద్రంలో వందశాతం పోలింగ్..

ఆ పోలింగ్ కేంద్రంలో రుచికరమైన వంటకాలను వడ్డించారు.. వంద శాతం పోలింగ్‌తో రికార్డు..
Himachal Pradesh Voters
Follow us on

హిమాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో దాదాపు 66 శాతం పోలింగ్ నమోదైంది. 7881 కేంద్రాల్లో పోలింగ్ నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పోలింగ్ కేంద్రమైన తాషిగ్యాంగ్‌లో ఓటర్లు చరిత్ర సృష్టించారు. అక్కడి పోలింగ్ కేంద్రంలో వందశాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 52 మంది ఓటర్లు ఉండగా.. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాషిగ్యాంగ్‌లోని ఓటర్లు సంప్రదాయ దుస్తులు ధరించి తమ ఓటు వేశారు. పోలింగ్ బూత్ ను పెళ్లికుమార్తెలా అలంకరించారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్న ఓటర్లందరికీ ఎన్నికల సంఘం ఘన స్వాగతం పలికింది. లహౌలీ సంప్రదాయం ప్రకారం ఓటర్లు ఖటక్ దుస్తులు ధరించారు. పోలింగ్ సిబ్బంది సైతం సంప్రదాయ దుస్తులు ధరించారు. టిమో, సాగ్ వంటి స్థానిక రుచికరమైన వంటకాలను ఓటర్లకు వడ్డించారు. ఈ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ జరుగుతుందా లేదా ఏదైనా ఫంక్షన్ జరుగుతుందా అనే అనుమానం కలిగేలా పోలింగ్ కేంద్రాన్ని అందంగా అలంకరించారు. మరోవైపు ఓటర్లంతా ఎంతో చైతన్యంతో పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కొండ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్ లో 80 ఏళ్లు పైబడిన ఓటర్లు లక్షా 21 వేల మంది కాగా.. వీరిలో 1,136 మంది వంద సంవత్సరాలు దాటినవారున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగుల కోసం ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. దీంతో ఎంతో మంది శతాధిక వృద్ధులు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.

బీజేపీ జాతీయ అధ్యక్షులు జెపి.నడ్డా, హిమాచల్ ప్రదేశ్ సీఏం జైరాం ఠాకూర్, కేంద్ర సమాచార, ప్రచార శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులతో కలిసి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వీరభద్ర సింగ్ కుమారుడు విక్రమాదిత్య సింగ్ తన తల్లి ప్రతిభా సింగ్ తో కలిసి రాంపూర్‌లో ఓటు వేశారు. వీరభద్రసింగ్ ఆరు సార్లు సీఏంగా పనిచేశారు. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ముందుండి నడింపించారు విక్రమాదిత్య సింగ్.

ఇవి కూడా చదవండి

హిమాచల్ ప్రదేశ్ లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక మోడల్ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటుచేసి.. అందంగా అలంకరించారు. కొన్ని పోలింగ్ కేంద్రాల వద్ద తల్లిదండ్రులతో పాటు వచ్చిన పిల్లలు ఆడుకోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రజాస్వామ్య పండుగలో పాల్గొని తమ పేరెంట్స్ ఓట్లు వేస్తే.. పిల్లలు మాత్రం ఆట, పాటలతో సందడి చేశారు. హిమాచల్ ప్రదేశ్ శాసనసభకు పోలింగ్ ముగిసిన తర్వాత కేంద్రాల్లో EVMలు, VVPATలను సీలు చేసి స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారు. పోలింగ్ ముగిసిన హిమాచల్ వాసులు ఫలితాల కోసం 26 రోజులు వేచి చూడాల్సి ఉంది. డిసెంబర్ 8వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.

మరిన్నిజాతీయ వార్తల కోసం చూడండి..