కేంద్ర మంత్రుల కార్‌పూలింగ్‌.. ప్రధాని మోదీ పిలుపుతో కిషన్ రెడ్డి వినూత్న ఆలోచన

ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపు పిలుపునకు మద్దతుగా కేంద్ర మంత్రులు జి. కిషన్ రెడ్డి, శివరాజ్ సింగ్ చౌహాన్, సి.ఆర్. పాటిల్ న్యూఢిల్లీలో జరిగిన కేబినెట్ సమావేశానికి ఒకే కారులో ప్రయాణించారు. కార్‌పూలింగ్ ద్వారా ఇంధన వినియోగం, కార్బన్ ఉద్గారాలు తగ్గుతాయని, పచ్చని భారత నిర్మాణానికి ఇది దోహదపడుతుందని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

కేంద్ర మంత్రుల కార్‌పూలింగ్‌.. ప్రధాని మోదీ పిలుపుతో కిషన్ రెడ్డి వినూత్న ఆలోచన
G Kishan Reddy Carpooling

Updated on: Jun 03, 2026 | 5:39 PM

ఇంధన వినియోగాన్ని తగ్గించి, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునకు మద్దతుగా కేంద్ర మంత్రులు కార్‌పూలింగ్‌ను ప్రోత్సహించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తన కేబినెట్‌ సహచరులైన కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో కలిసి వీక్లీ కేబినెట్‌ మీటింగ్‌కు ఒకే కారులో ప్రయాణించారు.

ఈ విషయాన్ని కిషన్ రెడ్డి తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇచ్చిన ఇంధన పొదుపు సందేశాన్ని ఆచరణలో చూపించేందుకు తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సాధారణంగా కేంద్ర మంత్రులు వేర్వేరు అధికారిక వాహనాల్లో ప్రయాణిస్తుంటారు. అయితే ఇంధన వినియోగాన్ని తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను నియంత్రించడం వంటి లక్ష్యాలతో ఈసారి ముగ్గురు మంత్రులు కలిసి ఒకే కారులో కేబినెట్‌ సమావేశానికి వెళ్లడం విశేషంగా మారింది.

“మన దైనందిన జీవితంలో చిన్న చిన్న మార్పులు కూడా పెద్ద ఫలితాలను తీసుకురాగలవు. కార్‌పూలింగ్‌ అనేది అలాంటి బాధ్యతాయుతమైన అలవాట్లలో ఒకటి. ఇది ఇంధనాన్ని ఆదా చేయడమే కాకుండా వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో కూడా కీలక పాత్ర పోషిస్తుంది” అని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే కార్‌పూలింగ్‌ ద్వారా రోడ్లపై వాహనాల సంఖ్య తగ్గి ట్రాఫిక్‌ రద్దీ కూడా కొంత మేర నియంత్రణలోకి వస్తుందని తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌ వంటి ఇంధనాలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించడంలో ప్రతి పౌరుడి భాగస్వామ్యం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కార్‌పూలింగ్ అంటే ఎక్కువ మంది కలిసి తక్కువ దూరాన్ని ఒకే కారులో ప్రయాణించడం, దీన్ని రైడ్ షేరింగ్ అని కూడా అంటారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us