అసోంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా అక్కడ సంభవించిన వరదల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. వేల మంది నిరాశ్రయులు కాగా.. దీని ప్రభావం దాదాపు 28 లక్షల మందిపై పడింది. గురువారం నాటికి వరదల దాటికి 89 మంది మరణించగా.. తాజాగా మరో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో వరదల దాటికి మరణించిన వారి సంఖ్య 93కి చేరింది. లక్షల ఎకరాల్లో పంటలు వరదల్లో మునిగిపోయాయి. ఈ విషయాన్ని రాష్ట్ర విపత్తు నిర్వాహణ శాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో వరదల ప్రభావం ఉందన్నారు. వరద బాధిత గ్రామాల్లో పడవల సహాయంతో అక్కడి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామని అధికారులు వెల్లడించారు.
దిబ్రుఘర్ జిల్లాలోని దాదియా గ్రామంలో వరద నీరు ప్రభావంతో దాదాపు గ్రామంలోని అన్ని ఇళ్లు నీటమునిగిపోయాయి. ఆ గ్రామంలో దాదాపు 300కి పైగా పశువులు మరణించాయని అధికారులు తెలిపారు. కాగా, కజిరంగా నేషనల్ పార్క్లో వన్యప్రాణులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని అసోం పర్యావరణ శాఖ మంత్రి తెలిపారు. గతేడాది వరదలకు పెద్ద ఎత్తున వన్యప్రాణాలు మృత్యువాత పడ్డాయని.. ఈ సారి స్పీడ్ బోట్లతో పాటు.. వన్య ప్రాణులను రక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి.. సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో విజయం సాధించినట్లు మంత్రి వెల్లడించారు.