మావోయిస్టు ముక్త్‌ భారత్‌‌కు డెడ్‌లైన్‌ ఫిక్స్! సీఎంలతో అమిత్ షా దిశానిర్దేశం.. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్‌

| Edited By: Ram Naramaneni

Oct 06, 2024 | 10:08 PM

వరుస ఎన్‌కౌంటర్లతో డైలీ హెడ్‌లైన్స్‌. మావోయిస్టులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు డెడ్‌ లైన్స్‌. అదే ఆపరేషన్‌ కగార్‌. టార్గెట్‌..! మావోయిస్టు ముక్త్‌ భారత్‌. డెడ్‌లైన్‌ 2026.

మావోయిస్టు ముక్త్‌ భారత్‌‌కు డెడ్‌లైన్‌ ఫిక్స్! సీఎంలతో అమిత్ షా దిశానిర్దేశం.. హాజరు కానున్న చంద్రబాబు, రేవంత్‌
Amit Shah, Chandrababu, Revanth Reddy
Follow us on

వరుస ఎన్‌కౌంటర్లతో డైలీ హెడ్‌లైన్స్‌. మావోయిస్టులకు ఫుల్‌స్టాప్‌ పెట్టేందుకు డెడ్‌ లైన్స్‌. అదే ఆపరేషన్‌ కగార్‌. టార్గెట్‌..! మావోయిస్టు ముక్త్‌ భారత్‌. డెడ్‌లైన్‌ 2026. లాస్ట్‌ ఇయర్‌.. ఇదే టాపిక్‌ మీద కేంద్ర హోం మంత్రి అన్ని రాష్ట్రాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కేలండర్‌లో వన్‌ ఇయర్‌ తిరిగేసరికి డజన్ల సంఖ్యలో ఎన్‌కౌంటర్లు జరిగాయి. ముఖ్యంగా దండకారణ్యంలో మావోయిస్టులకు పెట్టని కోటగా ఉన్న అబూజ్‌మఢ్‌ లోకి చొరబడి మరీ నక్సల్స్‌ని లేపేస్తున్నాయి భద్రతా దళాలు. ఇక సోమవారం(అక్టోబర్ 7) మళ్లీ ఢిల్లీలో హోం మంత్రి అమిత్‌ షా నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మీటింగ్‌ జరగనుంది. ఈసారి మావోయిస్టుల మీదకు ఏ వ్యూహంతో దూసుకెళ్లనుంది కేంద్రం అన్నదీ హాట్‌ టాపిక్‌గా మారింది.

మావోయిస్టుల అంతం.. తమ పంతం అంటూ డేట్‌, టైమ్‌ ఫిక్స్ చేశారు అమిత్‌ షా. ఈ హై లెవెల్‌ మీటింగ్‌తో.. అరణ్యకాండలో ఆఖరి పర్వం మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నవారు. ఇదే దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర హో మంత్రి అమిత్‌ షా.. మార్గదర్శకత్వంలో ఆపరేషన్‌ కగార్‌ అప్రతిహతంగా కొనసాగుతోంది. అడవులను జల్లెడ పట్టేదెలా? మావోయిస్ట్‌లకు ఫుల్‌స్టాప్ పెట్టేదెలా? దీనిపైనే హస్తిన కేంద్రంగా మంత్రాంగం సాగుతోంది. గత ఏడాది అక్టోబర్‌ ఆరో తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా టార్గెట్‌ ఫిక్స్‌ చేశారు. సరిగ్గా ఏడాది కల్లా భద్రతాబలగాలు ఈ టార్గెట్‌లో చాలావరకు రీచ్‌ అయ్యాయి. నక్సలిజం సమస్యపై కేంద్రం తాజాగా మరో సమావేశం నిర్వహిస్తోంది. వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు 2026 మార్చిని డెడ్‌లైన్‌గా పెట్టింది. అప్పటికల్లా మావోయిస్టులను పూర్తిగా తుడిచి పెట్టెయ్యలన్న లక్ష్యంతో కేంద్రం ముందుకు సాగుతోంది.

నక్సల్స్ బాధిత రాష్ట్రాల సీఎంలతో భేటీకి చంద్రబాబు, రేవంత్‌

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో కేంద్రం కీలక సమావేశం నిర్వహించనుంది. మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా భేటీ అవుతారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు అవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి ఈ కీలక భేటీలో పాల్గొంటారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉన్నతాధికారులు, కేంద్ర బలగాల అధిపతులు…ఈ భేటీకి హాజరవుతారు. మార్చి 2026 నాటికి దేశంలో వామపక్ష తీవ్రవాదాన్ని పూర్తిగా రూపుమాపాలని లక్ష్యంగా నిర్దేశించుకున్న కేంద్రం. ఈ మేరకు రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందజేస్తోంది.

202మంది మావోయిస్టులు హతం

మావోయిస్టులపై పోరాటంలో రాష్ట్రాలకు సూచనలు, మార్గదర్శకాలు చేస్తోంది కేంద్రం. 2010తో పోల్చితే ఇప్పుడు మావోయిస్టు హింస 72 శాతం తగ్గిందని, మావోయిస్టుల హింస కారణంగా మరణించే వారి సంఖ్య కూడా 86 శాతం తగ్గిందని కేంద్ర హోం శాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 723 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఇక, పోలీసులు, భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లలో 202 మంది మావోయిస్టులు హతమయ్యారు. మరో 812 మంది అరెస్ట్ అయ్యారు. ఇక మావోయిస్టుల ప్రభావిత జిల్లాల సంఖ్య సైతం 38కి తగ్గినట్టు కేంద్రం వెల్లడించింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్లు, మొబైల్ టవర్లు, ఇతర మౌలిక వసతుల కోసం ప్రత్యేక అభివృద్ధి పథకాలు అమలు చేయడంతో పాటు..14,400 కి.మీ పొడవైన రోడ్ల నిర్మాణం, 6,000 మొబైల్ టవర్ల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళుతోంది కేంద్రం.

మావోయిస్టులను హడలెత్తిస్తున్న కోబ్రా దళాలు

1960వ దశకంలో బెంగాల్‌లో మొదలైన నక్సలిజం…ఆ తర్వాత దేశమంతటా వ్యాపించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా నెత్తుటేరులు పారించింది మావోయిస్టు ఉద్యమం. అయితే ఉమ్మడి ఏపీలో ఏర్పాటు చేసిన గ్రే హౌండ్స్‌ దళాలు.. మావోయిస్టులను సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. ఇంటెలిజెన్స్‌ నెట్‌వర్క్‌.. గ్రే హౌండ్స్‌ దళాల సమన్వయంతో మావోయిస్టులు చావు దెబ్బ తిన్నారు. వరుస ఎన్‌కౌంటర్లతో.. ఏపీ, తెలంగాణలో మావోయిస్టులు కనుమరుగైపోయారు. ఎక్కడో ఒకటి అర చోట్ల తప్ప మావోయిస్టుల ఉనికి కూడా కనిపించడం లేదు. ఈ గ్రే హౌండ్స్‌ని స్ఫూర్తిగా తీసుకున్న కేంద్రం.. సీఆర్పీఎఫ్‌ దళాల నుంచి మెరికల్లాంటి జవాన్లను ఎంపిక చేసి కోబ్రా బెటాలియన్లను రూపొందించింది.

కోబ్రా బెటాలియన్ల సాయంతో చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా, జార్ఖండ్, బెంగాల్ రాష్ట్రాలు ప్రస్తుతం మావోయిస్టులపై పోరు సాగిస్తున్నాయి. మొదట్లో ఎన్నో ఎదురుదెబ్బలు తిని, భారీ ప్రాణనష్టాలను చవిచూసిన ఈ దళాలు.. చివరకు విజయం సాధించాయి. గత కొన్నేళ్లలో మావోయిస్టులు ఈ ఎన్‌కౌంటర్ ఆపరేషన్లలో తీవ్రంగా నష్టపోయారు. దానికి బెస్ట్‌ ఎగ్జాంపుల్‌ అబూజ్‌మఢ్‌ అడవుల్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు పైచేయి సాధించడమే అంటున్నారు నిపుణులు.

కూలిపోయిన అబూజ్‌మఢ్‌ కోట

ఒకప్పుడు ఖాకీలు దూరలేని కారడవి. CRPF చేరుకోలేని చిట్టడవి. మావోయిస్టులకు పెట్టని కోట. అదే బస్తర్ దండకారణ్యం. అందులో ఎంత వెతికినా… అంతుచిక్కని అబూజ్‌మఢ్‌ మహారణ్యం. ఒక్క ముక్కలో చెప్పాలంటే అది మావోయిస్టుల హెడ్‌క్వార్టర్స్‌. ఒకప్పుడు అక్కడ వాళ్లదే రాజ్యం. అయితే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. ఎర్రకోటలో ఖాకీ తుపాకులు గర్జిస్తున్నాయి. వరుస ఎన్‌కౌంటర్లతో అబూజ్‌మఢ్‌ నెత్తురోడుతోంది. బస్తర్‌ మే సవాల్‌ అంటూ మావోయిస్టులను వాళ్ల అడ్డాలోనే చాలెంజ్‌ చేసే స్థాయికి బలగాలు వచ్చాయి

అరణ్యకాండలో ఆఖరి పర్వం

తాజాగా ఛత్తీస్‌గఢ్‌ అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ దేశంలోనే రెండో పెద్ద ఎన్‌కౌంటర్‌. అబూజ్‌మఢ్‌ అడవుల్లో….దంతెవాడ, నారాయణపూర్‌ జిల్లాల సరిహద్దులో మావోయిస్టుల క్యాంప్‌పై DRG బలగాలు విరుచుకుపడ్డాయి. ఈ భారీ ఎన్‌కౌంటర్‌లో 31మంది మావోయిస్టులు హతమయ్యారు. ఒకప్పుడు మావోయిస్టులకు పెట్టని కోట అబూజ్‌మఢ్‌ మహారణ్యం. 6 వేల చదరపు కిలోమీటర్లలో విస్తరించి..దేశంలోనే అతి పెద్ద అరణ్యంగా పేరు తెచ్చుకుంది. భద్రతా దళాలు ఒకప్పుడు అబూజ్‌మఢ్‌లో అడుగు పెట్టలేకపోయేవి. ఇప్పుడు అదే అబూజ్‌మఢ్‌లో పైచేయి సాధించాయి బలగాలు. 8 నెలల వ్యవధిలో అబూజ్‌మఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లలో 188 మంది నక్సల్స్‌ హతమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి వరుస ఎన్‌కౌంటర్లతో అబూజ్‌మఢ్‌పై బలగాలు పట్టు సాధించాయి. అరణ్యకాండలో ఆఖరి పర్వానికి తెర తీశాయి. మావోయిస్టులపై యుద్ధం చివరి చరణానికి చేరుకుందనే సంకేతాలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో మరో రెండేళ్లలో మావోయిస్టు ముక్త్‌ భారత్‌ చేస్తామంటోంది కేంద్రం. హోం మంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగే భేటీలో అత్యంత కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని సమాచారం. మావోయిస్టులను పూర్తిగా నిర్మూలించే ఆఖరి పోరాటానికి ప్రణాళికను సిద్ధం చేసేలా ఈ సమావేశంలో చర్చిస్తారు. ఆ తర్వాత సమరమే అంటోంది కేంద్రం.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..