పార్లమెంట్ భవనం ఎదుట ఇక అన్నదాతల నిరసన.. సమావేశాలు సజావుగా జరిగేనా ..?

| Edited By: Phani CH

Jul 04, 2021 | 9:55 PM

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ భవనం ఎదుట ప్రతి రోజూ రైతులు ఆందోళన నిర్వహిస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది.

పార్లమెంట్ భవనం ఎదుట ఇక అన్నదాతల నిరసన.. సమావేశాలు సజావుగా జరిగేనా ..?
Farmers To Protest Outside
Follow us on

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్ భవనం ఎదుట ప్రతి రోజూ రైతులు ఆందోళన నిర్వహిస్తారని సంయుక్త కిసాన్ మోర్చా ప్రకటించింది. వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ సభలో మీరు కూడా నిరసన తెలపాలంటూ ప్రతిపక్ష ఎంపీలకు తాము లేఖలు రాస్తున్నామని ఈ యూనియన్ నేత గుర్నామ్ సింగ్ చారుని తెలిపారు. ఈ నెల 17 నుంచే అన్నదాతలు ఇక్కడ ఆందోళన చేయడం ప్రారంభిస్తారని ఆయన చెప్పారు. కేవలం సభ నుంచి వాకౌట్ చేయరాదని తాము విపక్ష సభ్యులను కోరుతున్నామని, తమ సమస్యను ప్రభుత్వం చేపట్టేంతవరకు సభా కార్యకలాపాలను సాగనివ్వరాదని కూడా వార్నింగ్ ఇస్తున్నామని ఆయన వెల్లడించారు. 40 రైతు సంఘాల నుంచి అయిదుగురు చొప్పున రైతులు రోజూ ఈ ప్రొటెస్ట్ లో పాల్గొంటారని అన్నారు. పెట్రోలు, డీజిల్ ధరలపెంపునకు నిరసనగా ఈ నెల 8 న దేశ నిరసనకు తాము పిలుపునిస్తున్నట్టు ఆయన చెప్పారు.

ఇలా ఉండగా పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాలపై గల కేబినెట్ కమిటీ సిఫారసు చేసింది. ఈ సమావేశాలు షెడ్యూలు ప్రకారమే జరుగుతాయని ఆశిస్తున్నట్టు ఈ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ తెలిపారు. అటు- తమ ఆందోళనకు సంబంధించి రైతు సంఘాలు ఇప్పటి నుంచే వ్యూహాలు పన్నుతున్నాయి. ఢిల్లీ శివార్లలో కూడా ప్రొటెస్ట్ కొనసాగించాలని ఇవి తీర్మానించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే రైతు నేతలు పలువురు సమావేశమై ప్రధానంగా పార్లమెంట్ ముట్టడికి కూడా యత్నించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. అదే జరిగితే పార్లమెంటు సమావేశాలు సజావుగా జరుగుతాయా అని పలువురు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు.

 

 మరిన్ని  ఇక్కడ చూడండి: యూపీ రాజధాని లక్నోలో కుప్పలా కూలిపోయిన మాజీ ఎంపీ బిల్డింగ్… రక్షిత కట్టడాల పరిధిలోనిదన్న అధికారులు

Telangana Corona Updates: తెలంగాణలో గణనీయంగా తగ్గిన కరోనా కేసుల సంఖ్య.. తాజాగా ఎన్ని కేసులంటే..