‘నేను చచ్చిపోతే.. నా భార్య ఒంటరై పోతుంది’ భార్యను హత్య చేసిన ISRO రిటైర్డ్‌ అధికారి!

మానసిక సమస్యలతో సతమతమవుతున్న ఓ ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి దారుణానికి పాల్పడ్డాడు. వృద్ధాప్యంలో ఉన్న తాను చనిపోతే భార్యకు దిక్కెవరని భావించి.. తానుండగానే భార్య మరణిస్తుందని అనుకున్నాడు. ఆనక వంటగదిలో భార్య బిజీగా ఉన్న సమయంలో ఆమెపై దాడి చేసి హత మార్చి పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు వచ్చి అరెస్ట్ చేసేంత వరకు అక్కడే వేచి ఉండటం గమనార్హం. ఈ దారుణ ఘటన బెంగళూరులో బుధవారం (ఫిబ్రవరి 18) చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

నేను చచ్చిపోతే.. నా భార్య ఒంటరై పోతుంది భార్యను హత్య చేసిన ISRO రిటైర్డ్‌ అధికారి!
ISRO Ex Officia Killed Wife

Updated on: Feb 20, 2026 | 5:04 PM

బెంగళూరు, ఫిబ్రవరి 20: బెంగళూరు తూర్పు శివార్లలోని బొమ్మనహళ్లిలోని ది వర్చుసో అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్‌లో ఇస్రో రిటైర్డ్‌ ఉద్యోగి (75) నాగేశ్వర్‌రావు తన భార్య సంద్య శ్రీ (71)తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే నాగేశ్వరరావుకు తీవ్ర ఆరోగ్య సమస్యలు, మానసిక క్షోభతో పోరాడుతున్నాడు. ఈ క్రమంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అయితే తాను చనిపోతే భార్యను ఎవరు చూసుకుంటారనే సందేహం కలిగింది? దీంతో అంతకంటే ముందు సంద్య శ్రీని చంపాలని నిర్ణయించుకున్నాడు.

ఈ క్రమంలో బుధవారం ఉదయం 10 గంటల సమయంలో భార్య సంద్య శ్రీ వంటగదిలో ఉన్నప్పుడు వెనుక నుంచి వచ్చి ఆమె మెడకు టవల్ బిగించి చంపాడు. హత్య తర్వాత నాగేశ్వరరావు ఇంట్లోనే ఉండిపోయాడు. ఓ పరిచయస్తుడికి ఫోన్‌ ద్వారా మొత్తం చెప్పడంతో.. అతను ఉదయం 11 గంటలకు పోలీసులకు సమాచారం అందించాడు. ఆవలహళ్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా.. అక్కడ నిందితుడు అరెస్ట్ అయ్యేందుకు వేచి ఉన్నట్లు తెలిపాడు. ఈమేరకు పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నట్లు తూర్పు డివిజన్ జాయింట్ పోలీస్ కమిషనర్ రమేష్ బానోత్ మీడియాకు తెలిపారు.

ఇస్రో రిటైర్డ్ ఉద్యోగి పోలీసులకు ఏం చెప్పాడు?

ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు నాగేశ్వరరావు తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, మానసిక సమస్యలతో పోరాడుతున్నట్లు పోలీసులు తెలిపారు. తాను చనిపోతే తన భార్యను ఎవరు చూసుకుంటారో అని తీవ్ర ఆందోళన చెందుతున్నాడని పోలీసులు తెలిపారు. తమకు ఇక్కడ బంధువులు కూడా ఎవరూ లేరని, ఆమె ఒంటరిగా బాధపడటం తనకు ఇష్టం లేదని వివరించాడు. డిప్రెషన్ కు చికిత్స పొందుతున్నాడని, ఈ సంఘటన తర్వాత అతను ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడని, అందుకే అతను తన భార్యపై దాడి చేశాడని తెలుస్తోంది. దీనికి ఇతర ప్రధాన కారణాలు ఏవీ లేవని తెలుస్తోందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (వైట్ ఫీల్డ్) సైదులు అడవత్ మీడియాకు తెలిపారు. ఆ దంపతుల కుమార్తె అమెరికాలో నివసిస్తుందని, ఆమెకు సమాచారం అందించామని అన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాస్తు చేస్తున్నట్లు తెలిపారు. విచారణ సమయంలో అతను స్థిరమైన సమాధానాలు ఇవ్వలేదని, అతను మానసికంగా బాధపడుతున్నట్లు కనిపిస్తోందని బానోత్ చెప్పారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us