
అస్సాం అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ తన అభ్యర్థులను ప్రకటించగా, తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ4 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను విడుదల చేసింది. రాష్ట్రంలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడమే లక్ష్యంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.
మరికొన్ని గంటల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ రాబోతోంది. పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళం, అసోం, పుదుచ్చేరిలో ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను సాయంత్రం 4 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఈ ఐదు రాష్ట్రాల్లోనూ ఓటర్ల జాబితా సమగ్ర సవరణ ప్రక్రియ జరిగింది. ఎన్నికల సన్నద్ధతపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో పర్యటించారు కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్. ఈ దఫా పశ్చిమబెంగాల్లో మరిన్ని చర్యలు తీసుకోబోతోంది కేంద్ర ఎన్నికల సంఘం. 2021లో 294 నియోజకవర్గాలకు గాను 160 మంది సాధారణ పరిశీలకులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం.. — ఈ సారి ప్రతి నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకుడిని నియమించబోతోంది ఎన్నికల సంఘం.
పశ్చిమ బెంగాల్లో మే 7న.. తమిళనాడులో మే 10న.. అసోంలో మే 20న.. కేరళంలో మే 23న.. పుదుచ్చేరిలో జూన్ 15న అసెంబ్లీ పదవికాలం ముగియనుంది. దీంతో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఇవాళ డేట్స్ ఫిక్స్ చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం.