
దేశంలోని అస్సాం, కేరళ, తమిళనాడు, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో సహా కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో త్వరలోనే అసెంబ్లీ గడువు ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహించేందుకు ఈసీ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ను సోమవారం ఈసీ ప్రకటించనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఐదు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ ప్రక్రియ పూర్తైంది. బెంగాల్ మినహా మిగిలిన రాష్ట్రాల్లో తుది ఓటర్ల జాబితాల కూడా విడుదలైంది.
నేడో, రేపో బెంగాల్ ఓటర్ల తుది జాబితా కూడా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లపై ఇప్పటికే ఆయా రాష్ట్రాల్లో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఇతర అధికారులు పర్యటించారు. ఈ దఫా పశ్చిమబెంగాల్ ఎన్నికలకు సంబంధించి మరిన్ని చర్యలు తీసుకోబోతున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ప్రకటించారు.
అయితే 2021లో మొత్తం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 294 నియోజకవర్గాలకు గాను 160 మంది సాధారణ పరిశీలకులను కేంద్ర ఎన్నికల సంఘం నియమించగా ఆ సంఖ్యను ఈ సారి పెంచుతున్నట్టు తెలుస్తోంది. ఈ సారి రాష్ట్రం వ్యాప్తంగా ఉన్న మొత్తం 294 నియోజకవర్గాలకు నియోజకవర్గానికి ఒక సాధారణ పరిశీలకుడిని నియమిస్తున్నట్టు సమాచారం. అలాగే మరింత మంది పోలీసు వ్యయ పరిశీలకులను నియమించనున్న కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అయితే ఎన్నికల షెడ్యూల్ ఖరారు చేసే ముందు స్థానిక పండుగల్ని పరిగణనలోకి తీసుకోవాలని పలు రాజకీయ పార్టీలు ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.