రాజ్యసభలో సేమ్ సీన్ ! వెళ్లబోమంటున్న బహిష్కృత ఎంపీలు

రాజ్యసభలో సోమవారం కూడా దాదాపు నిన్నటి ఘటనలే రిపీటయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ సహా 8 మంది విపక్ష సభ్యులను వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు.

రాజ్యసభలో సేమ్ సీన్ ! వెళ్లబోమంటున్న బహిష్కృత ఎంపీలు

Edited By:

Updated on: Sep 21, 2020 | 1:39 PM

రాజ్యసభలో సోమవారం కూడా దాదాపు నిన్నటి ఘటనలే రిపీటయ్యాయి. తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్ సహా 8 మంది విపక్ష సభ్యులను వారం పాటు సస్పెండ్ చేస్తున్నట్టు చైర్మన్ వెంకయ్యనాయుడు ప్రకటించారు. కానీ సభ నుంచి బయటకు వెళ్లేందుకు వారు ససేమిరా అనడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. డెరెక్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, కాంగ్రెస్ సభ్యుడు రాజీవ్ శాతక్, సీపీఎం కి చెందిన కేకే.రాగేష్ లను వెంకయ్యనాయుడు పేర్లు పెట్టి మరీ మందలించారు. ఈ సభ్యులు చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించారని, సభాధ్యక్ష స్థానంలో ఉన్నవారిపట్ల అనుచితంగా వ్యవహరించారని ఆయన అన్నారు. నిన్న సభలో జరిగిన సంఘటనలు తననెంతో బాధించాయని, సభకు ఇది దుర్దినమని వ్యాఖ్యానించారు. మీరు బిల్లు ప్రతులను విసిరేశారని, మైకులను లాగేశారని, డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సింగ్ పట్ల చాలా అభ్యంతరకరంగా ప్రవర్తించారని వెంకయ్యనాయుడు అన్నారు. అయితే సభ నుంచి బయటకు వెళ్లబోమని సస్పెండయిన ఎంపీలు మంకుపట్టు పట్టారు.

వ్యవసాయ బిల్లుల్లో రెండింటిని రాజ్యసభ మూజువాణీ ఓటుతో నిన్న ఆమోదించింది. అయితే ఇది సహేతుకం కాదని, వీటిని సెలెక్ట్ కమిటీకి పంపాలని డెరెక్ సహా విపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.  ఇక ఈ బిల్లులను  రాష్ట్రపతి ఆమోదించాల్సి ఉంది.

 

Follow Us